రైతులను ఒప్పించలేక పోయాం: తోమర్

ABN , First Publish Date - 2021-11-19T22:28:39+05:30 IST

వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రకటనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి..

రైతులను ఒప్పించలేక పోయాం: తోమర్

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రకటనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. సాగు చట్టాలతో జరిగే మేలు గురించి కొన్ని రైతు గ్రూపులను ప్రభుత్వం ఒప్పించలేకపోయిందని అన్నారు. కొత్త చట్టాలు చేయడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను తొలగించాలని ప్రభుత్వం భావించిందని అన్నారు. అయితే రైతుకు ఒనగూరే ప్రయోజనాలపై కొందరు రైతులను తాము ఒప్పించలేకపోయమని, ఇది విచారకరమని అన్నారు.


 కొత్త చట్టాలు తీసుకురావాలనే ప్రధాని ఆలోచన వెనుక రైతుల జీవితాల్లో ''విప్లవాత్మక మార్పులు'' తీసుకు రావాలన్న ఉద్దేశమే ఉందని మంత్రి అన్నారు. గత ఏడేళ్లుగా వ్యవసాయం, రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కనీస మద్దతు ధరను పెట్టుబడి ధర కంటే 1.5 రెట్లు పెంచాలని, సేకరణ రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న రైతుల ఆదాయం పెరిగేందుకు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇంతవరకూ రూ.1.62 లక్షల కోట్లు పంపిణీ చేశామని చెప్పారు.

Updated Date - 2021-11-19T22:28:39+05:30 IST