మార్కెట్‌ మాయాజాలం

ABN , First Publish Date - 2021-02-27T05:12:38+05:30 IST

మార్కెట్‌ మాయాజాలంతో పత్తిరైతు దారుణంగా నష్టపోయాడు. జిల్లాలో దిగుబడి అయిన పత్తిలో దాదాపుగా 70శాతం మేరకు కొనుగోళ్లు జరిగాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత మార్కెట్‌ పైకి లేచింది. రెండు మాసాల క్రితం క్వింటాకు రూ.5వేలకు అటుఇటుగా ఉన్న పత్తిధర ప్రస్తుతం రూ.6,700దాకా పలుకుతోంది. దీంతో అమ్ముకున్న వారంతా లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగ్గా నెలన్నర రోజుల క్రితం బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర సీసీఐ ఇస్తున్న మద్దతు ధర కంటే తక్కువ.

మార్కెట్‌ మాయాజాలం
మార్కాపురంలో ఇటీవల అమ్మకానికి తెచ్చిన పత్తి బోరాలు (ఫైల్‌)

అయినకాడికి అమ్ముకున్నాక పత్తి ధర పైపైకి

ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు చేసింది 25,476 క్వింటాళ్లు

బహిరంగ మార్కెట్‌లో పెరిగిన ధర

తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులు

ఒంగోలు(జడ్పీ), ఫిబ్రవరి 25: మార్కెట్‌ మాయాజాలంతో పత్తిరైతు దారుణంగా నష్టపోయాడు. జిల్లాలో దిగుబడి అయిన పత్తిలో దాదాపుగా 70శాతం మేరకు కొనుగోళ్లు జరిగాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత మార్కెట్‌ పైకి లేచింది. రెండు మాసాల క్రితం క్వింటాకు రూ.5వేలకు అటుఇటుగా ఉన్న పత్తిధర ప్రస్తుతం రూ.6,700దాకా పలుకుతోంది. దీంతో అమ్ముకున్న వారంతా లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగ్గా నెలన్నర రోజుల క్రితం బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర సీసీఐ ఇస్తున్న మద్దతు ధర కంటే తక్కువ. దాదాపు రూ.5వేలకు అటుఇటుగా మార్కెట్‌ ధర ఉండేది. సీసీఐ పొడవు పింజ క్వింటాకు రూ.5,825, మీడియం అయితే రూ.5,725గా ధర నిర్ణయించింది. ఈ ధరకు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి సవాలక్ష నిబంధనలతో అడుగడుగునా కొర్రీలు వేస్తూ పత్తిని సీసీఐ మొక్కుబడిగా సేకరించింది. ఈ-క్రాప్‌ మొదలుకుని తేమశాతం, రంగు మారడం ఇతరత్రా నిబంధనలు రైతులకు కన్నీరు తెప్పించాయి. అయినా కేంద్రాల దగ్గర పడిగాపులు కాసి రైతులు తాము దిగుబడి  చేసిన పత్తిని అమ్ముకున్నారు. ఈ నిబంధనలతో విసిగి వేసారిన మరికొంతమంది బహిరంగ మార్కెట్‌లోనే తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇలా సీసీఐ ఇప్పటివరకు కొన్నది 25,476 క్వింటాళ్లు కాగా, బయట కూడా రైతులు అమ్మకాలు జరిపింది అంతకుపైనే ఉండొచ్చని అంచనా. అయితే తమ గడప దాటాకా పెరిగిన పత్తి ధరను చూసి అన్నదాతలు ఉసూరుమంటున్నారు. వ్యాపారుల సిండికేట్‌ మాయాజాలం పన్నిన వ్యూహంలో రైతులు మరోసారి నిలువునా వంచించబడ్డారు. ఈ పెరిగిన ధరలకు అంతర్జాతీయ డిమాండ్‌ అని, నాణ్యత అని రకరకాల బాష్యాలు మార్కెట్‌ పెద్దలు చెబుతున్నారు. వాస్తవంలో జరిగిందేమిటంటే రైతు తక్కువ ధరకు తన వద్ద ఉన్న పత్తిని అమ్ముకున్న వెంటనే ధర పెరిగింది.


వెసులుబాటు కోరినా..

జిల్లాలో సీసీఐ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 25,476 క్వింటాళ్ల పత్తిని సేకరించారు. పొడవు పింజ పత్తికి రూ.5,825, మీడియంకు రూ.5,725, కురచ రకానికి రూ.5,615లను మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. సీసీఐ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని నిబంధనలలో వెసులుబాటు కల్పించాలని గతంలో జిల్లా రైతాంగం కోరింది. అయినప్పటికీ స్పందన కరువు కాగా తక్కువ ధరకు బహిరంగ మార్కెట్‌లో పత్తిని రైతాంగం అమ్ముకుంది 


విపత్తులతో తగ్గిన దిగుబడి

జిల్లాలో పత్తి దిగుబడి దాదాపు 2లక్షల క్వింటాళ్ల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెటింగ్‌ యంత్రాంగం సీజన్‌ ఆరంభంలో లెక్కకట్టింది. తర్వాత కురిసిన అకాల వర్షాలకు తోడు నివర్‌ తుఫాన్‌ విరుచుకుపడడంతో అది కాస్తా లక్ష క్వింటాళ్లకే పరిమితమైంది. దాదాపు సగానికి సగం దిగుబడిలో కొత పడటంతో మౌనంగా రోదించడం అన్నదాత వంతైంది. దరిమిలా పత్తిని కొంటానికి రంగంలోకి దిగిన సీసీఐ అలవి కాని నిబంధనల పేరిట వారికి అందాల్సిన కనీస మద్దతు ధరను కూడా అందకుండా చేసింది. ప్రైవేటు అప్పుల వత్తిళ్లు భరించలేక అయినకాడికి అమ్ముకున్న తరువాత పత్తి ధర ఆకాశాన్ని చూస్తుంటే రైతు దిక్కుతోచక నేల చూపులు చూస్తున్నాడు. 

Updated Date - 2021-02-27T05:12:38+05:30 IST