కోస్తా.. భగభగ!!
ABN , First Publish Date - 2022-05-24T09:01:31+05:30 IST
పడమర నుంచి వీచిన పొడిగాలులతో కోస్తా ప్రాంతం భానుడి భగభగలతో అట్టుడికిపోయింది. అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీయడంతో ప్రజలు విలవిల్లాడారు.
పలుచోట్ల వడగాడ్పులు.. రాజానగరంలో 44.43 డిగ్రీలు
విశాఖపట్నం, మే 23(ఆంధ్రజ్యోతి): పడమర నుంచి వీచిన పొడిగాలులతో కోస్తా ప్రాంతం భానుడి భగభగలతో అట్టుడికిపోయింది. అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీయడంతో ప్రజలు విలవిల్లాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత ఇబ్బంది పెట్టింది. వేడిగాలులు వీయడంతో అనేక ప్రాంతాలు నిప్పులకొలిమిలా మారాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం.. సోమవారం కోస్తాలోని 4 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 24 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 44.44, అనపర్తి, బిక్కవోలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, భారత వాతావరణ శాఖ బులెటిన్ మేరకు తునిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఉంటుందని, 28 వరకు గాడ్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.