సరిహద్దులు దాటిన అవినీతి

ABN , First Publish Date - 2022-07-08T05:47:18+05:30 IST

: ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అవినీతి సరిహద్దులు దాటిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

సరిహద్దులు దాటిన అవినీతి

కాపుపై మాజీ మంత్రి కాలవ ధ్వజం

అనంతపురం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అవినీతి సరిహద్దులు దాటిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. అనంతపురంలోని తన నివాసంలో గురువారం  మీడియాతో మాట్లాడారు. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను కమీషన్లు ఇవ్వాలని కాపు బెదిరించడం దుర్మార్గమని అన్నారు. కమీషన్ల కోసం కర్ణాటక కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం ద్వారా తన అవినీతిని పొరుగు రాష్ర్టాలకు విస్తరించాడని ధ్వజమెత్తారు. మూడేళ్లుగా రాయదుర్గం నియోజకవర్గంలో సహజ వనరులు, ప్రజల సొమ్మును దోచుకున్నారని, ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో పనులపై కన్నేయడం కాపు బరితెగింపునకు పరాకాష్ట అని అన్నారు. కర్ణాటక కాంట్రాక్టర్లను బెదిరించి, జగన ప్రభుత్వ పరువును తీశారని అన్నారు. జిల్లా సరిహద్దుల్లో కాపు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో తుంగభద్ర ఎగువకాలువ పరిస్థితి అధ్వానంగా ఉందని, దానివైపు ఏనాడూ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. అలాంటిది కర్ణాటకలో కాలువపై పర్యటించి, కాంట్రాక్టర్లను బెదిరించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. హెచ్చెల్సీ పొడవునా గట్లు బలహీనంగా మారాయని, పలు వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని కాలవ అన్నారు. మూడేళ్ల నుంచి కనీస మరమ్మతులు చేయించలేని అసమర్థ ఎమ్మెల్యే కాపు అని మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌ బరితెగింపుపై ముఖ్యమంత్రి జగనరెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-08T05:47:18+05:30 IST