మీతో మాకు పనేంటి..!
ABN , First Publish Date - 2021-05-17T05:59:57+05:30 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్పొరేటర్లుగా బరిలో ఉన్న అభ్యర్ధులు సేవా కార్యక్రమాలకు పోటీ పడ్డారు.
అడ్రస్ లేని కార్పొరేటర్లు
గెలిచిన అభ్యర్థులు సోషల్ మీడియాలో ఫోజులు.. ఓడిన వారు ఇళ్లకే పరిమితం
ఆపన్నహస్తాల కోసం పేద వర్గాల ఎదురుచూపు
అజిత్సింగ్నగర్, మే 16 : సరిగ్గా ఎడాది క్రితం.... కరోనా మహమ్మారి విజృంభించడంతో స్థానిక ఎన్నికలు అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే్షకుమార్ వాయిదా వేశారు. ఇంకేముంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్పొరేటర్లుగా బరిలో ఉన్న అభ్యర్ధులు సేవా కార్యక్రమాలకు పోటీ పడ్డారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు రంజాన్ మాసంలో రంజాన్ తోఫాలంటూ ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు చేశారు. వైసీపీ, టీడీపీలతో పాటు వామపక్ష పార్టీలు సైతం వివిధ రూపాల్లో ప్రజలకు సేవలందించారు. ‘మీకు మేమున్నాం’ అంటూ నానా హడావుడి చేశారు. కరోనా సద్దుమణిగిందని ఈ ఎడాది మార్చిలో స్థానిక ఎన్నికలు జరిగాయి. శివారు ప్రాంతాల్లోని 9 డివిజన్లలో 8 డివిజన్లలో అధికార వైసీపీ అభ్యర్ధులు గెలవగా ఒక్క డివిజన్లో టీడీపీ అభ్యర్ధి గెలిచారు. ప్రధాన పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్ధులు సేవాకార్యక్రమాల హడావుడి అంతా ఇంతా కాదు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇద్దరు కార్పొరేటర్లు కోటి రూపాయిలకు పైనే ఎన్నికల ఖర్చు పెట్టినట్లు బహిరంగంగానే శివారు ప్రజలు చర్చించుకున్నారు. మూడు నెలల క్రితం వరకు నిత్యం ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేసిన నేతలను ఇప్పుడు ప్రజలు వెళ్లి కలుద్దామన్నా కంటికి కనిపించడం లేదు. గెలిచి రెండు నెలలు కావస్తోంది. కరోనా సెకండ్వేవ్తో కర్ఫ్యూ సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల్లో రోజువారి కార్మికులతో పాటు చిరువ్యాపారాలు చేసుకునే వారే అధికం. కనీసం వీరి గురించి పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. గెలిచిన అభ్యర్ధులు సోషల్ మీడియాలో తమ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫొటోలతో ఫోజులు ఇవ్వడం మినహా కనీస సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. ఓడిన అభ్యర్థులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహాయం కూడా కనిపించడం లేదు. ఆటోవాలాలు, కార్మికులు పనుల్లేక, చిరువ్యాపారులు వ్యాపారం లేక డీలా పడుతున్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకుంటే రాజకీయ నేతల పట్ల గౌరవం పెరుగుతుంది. శివారు ప్రాంతాల్లో ఒకరిద్దరు కార్పొరేటర్లు మినహా అత్యధికులు ఆర్థికంగా స్థితిమంతులే. ఐదేళ్ల వరకు ప్రజలతో పని లేనప్పుడు చేయాలసిందేముందన్న భావనలో ప్రజాప్రతినిధుల ఉన్నట్టు కనిపిస్తోంది.