జీసస్ కనిపించారన్న వదంతులతో కొలంబియాలో లాక్డౌన్ బేఖాతర్
ABN , First Publish Date - 2020-04-10T07:28:19+05:30 IST
మూఢనమ్మకాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ సమస్య భారత్కు మాత్రమే పరిమితం కాలేదు. ..
కొలంబియా, ఏప్రిల్ 9: మూఢనమ్మకాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ సమస్య భారత్కు మాత్రమే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచాన్నీ వేధిస్తోంది. తాజాగా కొలంబియాలో వెలుగుచూసిన ఓ ఘటన దీనికి పరాకాష్టగా నిలుస్తోంది. అక్కడ మెగాంగ్యూ అనే పట్టణంలోని ఓ చెట్టు కొమ్మపై జీసస్ ప్రతిరూపం కనిపిస్తోందన్న వదంతులను నమ్మిన స్థానికులు తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. ఆ చెట్టుకింద క్యాండిల్స్ వెలిగించి ప్రార్థనలు చేయడం మొదలెట్టారు. కరోనా బారి నుంచి ప్రపంచాన్ని రక్షించమని జీస్సను వేడుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ.. భక్తి మత్తులో పడి వారు భౌతికదూరం పాటించడం మరిచారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ నిబంధనలను కూడా అతిక్రమించారు. కనీసం మాస్కులు కూడా ధరించలేదు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు అతికష్టం మీద వారిని చెదరగొట్టారు.