కరోనా నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ ఎంపీకి పోలీసుల జరిమానా
ABN , First Publish Date - 2020-06-05T18:08:08+05:30 IST
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించిన భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగికి నగర పోలీసులు....
భువనేశ్వర్ (ఒడిశా): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించిన భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగికి నగర పోలీసులు 300 రూపాయల జరిమానా విధించారు. కరోనా ప్రబలుతున్న సమయంలో బీజేపీ ఎంపీ భువనేశ్వర్ నగరంలో మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించారని భువనేశ్వర్ పోలీసులు ఎంపీ అపరాజితతోపాటు మరో 20 మంది బీజేపీ సభ్యులపై కేసు నమోదు చేశారు. భువనేశ్వర్ నగరంలో జరిగిన బీజేపీ సమావేశంలో ఎంపీ అపరాజితతో సహా 21 మంది నిబంధనలను ఉల్లంఘించినందున వారిపై కేసులు నమోదు చేసి వారినుంచి జరిమానాను వసూలు చేశామని భువనేశ్వర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ చెప్పారు. మాజీ అధికారిణి అయిన అపరాజిత సామాజిక దూరం పాటించకుండా ఫొటోలు దిగి సఓషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. కరోనా నిబంధనలను గౌరవిస్తూ తాను స్వచ్ఛందంగా జరిమానా చెల్లించానని ఎంపీ అపరాజిత ట్వీట్ చేశారు. కాగా సామాజిక దూరం నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీ అపరాజితపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.