కరోనా భయంతో అంత్యక్రియలంటేనే జంకుతుంటే.. మంత్రి మాత్రం..

ABN , First Publish Date - 2020-03-27T02:46:57+05:30 IST

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అనాధ వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు చేయించారు.

కరోనా భయంతో అంత్యక్రియలంటేనే జంకుతుంటే.. మంత్రి మాత్రం..

హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అనాధ వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు చేయించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా యాచకురాలుగా జీవనం కొనసాగిస్తున్న యాదమ్మ అనే వృద్ధురాలు అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  అప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్ల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ బిజీగా ఉన్నారు.  తెలంగాణ చౌరస్తాలో అనాథ వృద్ధురాలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి హుటాహుటిన అక్కడికి వెళ్లి మృతి చెందిన వృద్ధురాలి వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు మానసిక వికలాంగుడైన ఒక కుమారుడు కూడా ఉన్నాడని.. వారిద్దరు కలిసి భిక్షాటనతో జీవనం సాగిస్తూ, రాత్రి కాగానే తెలంగాణ చౌరస్తా ప్రాంతంలో నిద్రిస్తారని మున్సిపల్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకొని మంత్రి చలించిపోయారు. మంత్రి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. స్వయంగా మంత్రి ఆ అనాథ మృతురాలి శవాన్ని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లి అంత్యక్రియలకు పంపారు. కరోనా భయంతో అయిన వారి అంత్యక్రియలకు వెళ్లాలంటేనే జంకుతున్న ఈ తరుణంలో అనాథ వృద్ధురాలికి అన్నీ తానై అంత్యక్రియలు చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

Updated Date - 2020-03-27T02:46:57+05:30 IST