న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో తెలుగు విద్యార్థులు
ABN , First Publish Date - 2020-02-20T08:04:25+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) మొట్టమొదట వెలుగు చూసింది...చైనాలోని వుహాన్ నగరంలో. అనంతరం కొద్దిరోజుల్లో ప్రపంచంలోని 28 దేశాలకు విస్తరించింది.
గుంటూరు (మెడికల్) ఫిబ్రవరి 19: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) మొట్టమొదట వెలుగు చూసింది...చైనాలోని వుహాన్ నగరంలో. అనంతరం కొద్దిరోజుల్లో ప్రపంచంలోని 28 దేశాలకు విస్తరించింది. వేలా ది మంది వుహాన్ నగరవాసులు కరోనా వైరస్ బాడగా, వందల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. కోటి మందికి పైగా జనాభా ఉన్న వుహాన్ నగరంలో ప్రస్తుతం శశ్మాన నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. ప్రజలంతా గృహ నిర్బందంలోనే జీవిస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి ఇంటి నుంచి ఒకరు మార్కెట్కు వచ్చి కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకొని వెడుతున్నారు. ఇటువంటి వుహాన్ నుంచి ప్రాణాలతో బయట పడ్డ ఇద్దరు గుం టూరు వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వస్థలాలకి చేరుకున్నారు. అసలు ప్రాణాలతో బయటపడి తమ వారిని చూస్తామనే నమ్మకం కూడా లేని స్థితిలో ఎట్టకేలకు వారు బుధవారం ఇంటికి చేరడంతో వారి ఆనందానికి అవఽధులు లేకుండా పోయాయి. తమ వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు కూడా వారిని అక్కున చేర్చుకొని రోధించారు. కరోనా వైరస్ కాటు నుంచి తప్పించుకొని స్వస్థలానికి చేర్చచడంతో సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెడితే...
మూడు వారాల కిందట వుహాన్ నుంచి ప్రత్యేక విమానంలో మన రాష్ట్రానికి చెందిన 23 మంది తెలుగువారు న్యూఢిల్లీకి చేరుకున్నారు. చైనా నుంచి విమానంలో న్యూఢిల్లీ రాగా, కరోనా వైరస్ అనుమానంతో వీరిని అక్కడ మిలిటరీ హాస్పిటల్లో 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచారు. వీరిలో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి, గుంటూరు సమీపంలోని గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఉన్నారు. వారానికి ఒకసారి చొప్పున రెండు సార్లు వీరందరికీ కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఎవరికీ వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో 23 మంది స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతించింది. మంగవారం వీరు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాలకు విమానంలో చేరుకున్నారు. గుంటూరుకు చెందిన ఇద్దరు బుధవారం స్వస్థలానికి చేరుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ప్రకటించాయి. ముందు జాగ్రత్తగా గుంటూరు డీఎంహెచ్వో డాక్టర్ యాస్మిన్, వీరి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. వీరు ఇంటికి వచ్చినా 14 రోజుల పాటు బయటకు పంపవద్దని, గృహ నిర్భందంలోనే ఉంచాలని కోరారు. సినిమాలకు, ఫంక్షన్లకు పంపవద్దని స్పష్టంచేశారు. ఒకవేళ ఈ 14 రోజుల్లోపు వీరికి దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తు తమకు చెప్పాలని సూచించారు.
వివక్ష కారణంగా వివరాలు గోప్యం...
కరోనా వైరస్ మొదట వెలుగు చూసిన వుహాన్ నగరం నుంచి ఇద్దరు జిల్లావాసులు స్వస్థలానికి వచ్చినట్లు తెలిస్తే చుట్టుపక్కల వారు ఆందోళన చెందుతారని, వివక్ష చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు, వీరి వివరాలను గోప్యంగా ఉంచాలని గుంటూరు జిల్లా డీఎంహెచ్వోకు సూచించారు. వారి పేర్లు, చిరునామా తదితర వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని ఆదేశించారు. దీంతో పాటు ఆ ఇద్దరికి కరోనా వైరస్ సోకలేదని, వారి పట్ల వివక్ష చూపొద్దని ఆదే శించడంతో పాటు ఇద్దరికి కోవిడ్-19 వైరస్ లేదని తెలిపే ధృవీకరణ పత్రాలు అందజేసింది. అయితే ముందస్తు జాగ్రత్తగా వీరి ఆరోగ్యం రెండు వారాల పాటు పరిశీలించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. కరోనా వైరస్ కొంత మందిలో గర్భిష్టంగా 28 రోజుల వరకు బయట పడే అవకాశం ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చైనా నుంచి మరో పది మంది రాక...
ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల కిందట చైనా నుంచి పది మంది జిల్లావాసులు గుంటూరుకు చేరుకున్నారు. వీరిలో ఏడుగురు చైనాలోని కో మింగ్ నగరంలో ఉంటుండగా, మిగిలిన ముగ్గు రు చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇది వుహాన్ నగరానికి బాగా దూరంగా ఉండే ప్రాంతాలు కావడం గమనార్హం. అయినప్పటికీ వీరందరికీ కరోనా వైరస్ పరీక్షలు జరిపి, వీరికి వైరస్ సోకలేదని తేలిన తర్వాత గుంటూరు జిల్లాకు పంపారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం మేరకు వీరిని స్వస్థలాల్లో గృహ నిర్భందంలో ఉంచారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖవర్గాలు నిత్యం పరిశీలిస్తున్నాయి. కుటుంబ సభ్యులు మాస్కులుఽ దరించాలని, కొంత కాలం పాటు పిల్లలను వీరికి దూరంగా ఉంచాలని డాక్టర్లు ఆయా కుటుంబ సభ్యులకు తెలిపారు. కార్వంటైన్ పిరియడ్ ముగిసే వరకు ఈ పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు.
14 రోజులు గృహ నిర్బంధంలోనే: డీఎంహెచ్వో
జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు చైనాలోని వుహాన్ నగరం నుంచి బుధవారం గుంటూరకు చేరుకున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. బుధవారం తన ఛాంబర్లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరిని 14 రోజుల పాటు వారి ఇంటిలోనే క్వారంటైన్లో ఉంచుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. వీరికి రెండు సార్లు కరోనా వైర్సపరీక్ష చేయగా, వైరస్ సోకలేదని తేలిందన్నారు.. అందువల్ల ఇక పరీక్షలు అవసరం లేదని, కేవలం ముందస్తు జాగ్రత్తగా మాత్రమే మరో రెండు వారాలు పాటు ఇల్లు వదిలి బయటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.