ఐపీఎల్‌ వాయిదానా...రద్దా?

ABN , First Publish Date - 2020-04-09T10:02:08+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా టోర్నీలు రద్దు లేదా వాయిదా పడుతున్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఐపీఎల్‌ను ఈ నెల...

ఐపీఎల్‌ వాయిదానా...రద్దా?

ఏదో ఒకటి తేల్చండి!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా టోర్నీలు రద్దు లేదా వాయిదా పడుతున్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఐపీఎల్‌ను ఈ నెల 15కు వాయిదా వేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ కూడా ఐపీఎల్‌పై స్పష్టత ఇవ్వలేక పోతోంది. దీంతో మెగా లీగ్‌పై ఆశలు పెట్టుకున్న విదేశీ ఆటగాళ్లు వేచి చూస్తున్నారు. అయితే, ఐపీఎల్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇంగ్లండ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ జోస్‌ బట్లర్‌ కోరుతున్నాడు. ఎంతో ప్రతిష్ఠాత్మక లీగ్‌ను రద్దు చేయ డం లేదా షెడ్యూల్‌ మార్చడం అవమానకరమన్నాడు. ‘నాకేమీ ప్రత్యేక సమాచారం తెలియదు. ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఇలాగే ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు లీగ్‌ను నిర్వహిస్తారా? లేదా? అనేది కూడా చెప్పలేం. కానీ, నేను మాత్రం భారీగా ఆదాయాన్ని ఆర్జించే ఐపీఎల్‌ లాంటి మెగా టోర్నీ జరగాలనే కోరుకుంటా. ఐపీఎల్‌ను రద్దు చేయడం లేదా ఇందుకోసం ఖరారైన షెడ్యూల్‌లో మార్పులు చేయడం అవమానకరంగా భావిస్తాన’ని బట్లర్‌ అన్నాడు. 


టోర్నీ జరుగుతుంది..: స్మిత్‌

ఐపీఎల్‌ కచ్చితంగా జరుగుతుందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. ఏదో ఒక సమయంలో లీగ్‌ను నిర్వహిస్తారని భావిస్తున్నానన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు స్మిత్‌ సారథ్యం వహిస్తున్నాడు. కెప్టెన్‌గా ఈసారి పూర్తిస్థాయి లీగ్‌ ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. 


అక్టోబరులోనే సాధ్యం: నెహ్రా

కరోనా వైరస్‌ అదుపులోకి వస్తే.. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఐపీఎల్‌ జరిగే అవకాశం ఉందని మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. అక్టోబరులో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.


Updated Date - 2020-04-09T10:02:08+05:30 IST