కరోనా.. రైతులకు ఎంతకష్టమో..

ABN , First Publish Date - 2020-04-03T08:42:24+05:30 IST

corona virus

కరోనా.. రైతులకు ఎంతకష్టమో..

కర్నూలు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రభావంతో ఉల్లి రైతులు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో క్వింటా రూ.13 వేలు పలకడంతో.. ఈ సీజన్‌లోనూ ఉల్లి వైపే ఎక్కువమంది రైతులు మొగ్గుచూపారు. కానీ.. దేశమంతా అమలవుతున్న లాక్‌డౌన్‌తో వారికి నిరాశే ఎదురైంది. వారం క్రితం వరకు క్వింటా రూ.3వేల దాకా పలికిన ధరలు ఒక్కసారిగా రూ.700-800కు పడిపోయాయి. దీంతో పొలాల్లో సిద్ధంగా ఉన్న పంటను నష్టానికి అమ్మలేక.. దాన్ని అలాగే ఉంచుకోలేక ఉల్లి రైతులు విలవిల్లాడుతున్నారు. పొలాల్లోనే టెంట్లు వేసి కావలి కాస్తున్నారు. రెండ్రోజుల్లో ధర వస్తే సరి.. లేకుంటే గొర్రెలకు ఆహారంగా వేయాల్సిందేనంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉల్లి అత్యధికంగా పండించే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో ఏకంగా 3,500 హెక్టార్లలో పంట సాగు చేశారు. ఎకరాకు రూ.50వేల చొప్పున రూ.40 కోట్ల పెట్టుబడి పెట్టారు. కానీ ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం అమ్మితే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. 


మార్కెట్‌ యార్డు మూసివేత

లాక్‌డౌన్‌ కారణంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఈనెల 1 నుంచి 14 వరకు కర్నూలు మార్కెట్‌ యార్డుకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం 3,500 హెక్టార్లలో ఎకరాకు 40 క్వింటాళ్ల చొప్పున చూసినా జిల్లాలో 3.20 లక్షల క్వింటాళ్ల ఉల్లి అందుబాటులో ఉంది. అందులో 2 లక్షల క్వింటాళ్లు కర్నూలు యార్డులో, మరికొంత సరుకును వ్యాపారులు నేరుగా ఇప్పటివరకు కొనుగోలు చేశారు. మిగిలిన పంటలో దాదాపు 78 శాతం పంట పొలాల్లోనే టెంట్ల నీడన మగ్గుతోంది.  

Updated Date - 2020-04-03T08:42:24+05:30 IST