ఆందోళన వద్దు..అండగా ఉంటాం
ABN , First Publish Date - 2020-03-29T11:00:48+05:30 IST
కరోనావైరస్ ప్రబలకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మానవతాదృక్పథంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నందున ఎలాంటి ఆందోళనకూ గురికావద్దని నిరాశ్రయులు, యాచకులు, అనాథలకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భరోసా ఇచ్చారు.
అనాథలకు కలెక్టర్ గంధం చంద్రుడు భరోసా
అనంతపురం క్లాక్టవర్, మార్చి 28: కరోనావైరస్ ప్రబలకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మానవతాదృక్పథంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నందున ఎలాంటి ఆందోళనకూ గురికావద్దని నిరాశ్రయులు, యాచకులు, అనాథలకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భరోసా ఇచ్చారు. స్థానిక ఆదిమూర్తినగర్లో గల సాంఘిక, బీసీ సంక్షేమశాఖల వసతిగృహసముదాయంలో ఆశ్రయం పొందుతున్న అనాథలు, యాచకుల పరిస్థితులను శనివారం మధ్యాహ్నం ఆయ న పరిశీలించారు. తాత్కాలిక నివాసంలో ఏర్పాటు చేసిన వసతులు, అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనాథలందరికీ మూడు పూటలా భోజనం ఏర్పాటు చేస్తామని, బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ యంత్రాంగం అండ గా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లావ్యాప్తంగా గల యాచకులు, అనాథలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతిగృహాల్లో చేర్చాలన్నారు. అలాగే పింఛనర్లకు ఇక్కడే పింఛన్లు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, మెప్మా పీడీ విజయలక్ష్మి, సాంఘిక, బీసీ సంక్షేమశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యాచకుల శుభ్రతపై స్వచ్చంధ సంస్థల దృష్టి
లాక్డౌన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవతో వివిధ తాత్కాలిక వసతిగృహాల్లో ఆశ్రయం పొందుతున్న యాచకులు, అనాథలు, వృధ్ధుల పరిశుభ్రతపై స్వచ్ఛందసంస్థలు దృష్టి పెట్టాయి. స్పందన ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చరణ్నంద, సాయిట్రస్టు అధ్యక్షుడు విజయసాయి, చైతన్యం ట్రస్టు ప్రతినిధి అరుణ్ శనివారం ఆయా వసతిగృహాలకు వెళ్లి యాచకులు, అనాథలకు క్షౌరం, స్నానం చేయించి శుభ్రంగా ఉండాలంటూ మా స్కులు అందజేశారు.