తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-01-15T13:27:02+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. గత ఏడాది మార్చిలో కరోనాతో దేశంలో భయం మొదలైంది. జూన్, జులై నాటికి కరోనా పీక్ పాయింట్‌కు చేరుకుంది. మందులేని నయాన్ని ఎలా నయం చేయాలో తెలియక డాక్టర్లు, దాని బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఈ లోపే దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటిపోయింది.


రోగం మన దరికి చేరకుండా కరోనా టీకా ఒక్కటే మార్గమని గుర్తించారు. అమెరికా, ఐరోపాలో కరోనా టీకాల పంపిణీ వేగం పుంజుకుంటున్న తరుణంలోనే బారత్ కూడా సీరియస్‌గా దృష్టి సారించింది. టీకా తయారీకి మూడు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. భారీ స్థాయిలో టీకాలు తయారు కావడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ అన్ని రాష్ట్రాలకు టీకా చేరవేత కార్యక్రమం పూర్తయింది.


శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుకానుంది. ఆన్‌లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలన జరగనుంది. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అధికారులు పర్యవేక్షించనున్నారు. నిరంతర ప్రక్రియకు కేంద్రం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసింది.


Updated Date - 2021-01-15T13:27:02+05:30 IST