మోదీ పుట్టినరోజున.. టీకాల కాకిలెక్కలు
ABN , First Publish Date - 2021-09-29T07:18:56+05:30 IST
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 17న జరిగిన 2.5 కోట్ల డోసుల
‘ది కారవాన్’ సంచలన కథనం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 17న జరిగిన 2.5 కోట్ల డోసుల రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయం టూ ‘ది కారవాన్’ మేగజైన్ సంచలన కథనా న్ని ప్రచురించింది. అంతకుముందే టీకా డోసు తీసుకున్న పలువురికి, రెండో డోసు వేయకుండానే ఇంకొందరికి ఆ రోజునే వ్యాక్సినేషన్ ధ్రు వపత్రాలు జారీ చేశారని పేర్కొంది.
ఈ సమాచారాన్ని బిహార్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల టీకా లబ్ధిదారుల నుంచి సేకరించినట్లు తెలిపింది. ఇందులో ఏపీలోని తిరుపతికి చెందిన అర్షద్ అలీ అభిప్రాయం కూడా ఉంది. కాగా, అమెరికా కంపెనీ నోవావ్యాక్స్కు చెందిన కొవిడ్ టీకాతో 7-11 ఏళ్లలోపు పిల్లలపై ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ అనుమతులు మంజూరు చేసింది.
కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదంలో జాప్యం ?
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అత్యవసర వినియోగ అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోంది. వ్యాక్సిన్కు సంబంధించిన మరింత సాంకేతిక సమాచారాన్ని అందించాలని భారత్ బయోటెక్కు డబ్ల్యూహెచ్వో సూచించిందని సంబంధిత వర్గాలు తెలిపాయని ఓ ఆంగ్లపత్రిక వార్త ప్రచురించింది.
ఫైజర్ నుంచి కొవిడ్ మాత్రలు
కొవిడ్ వ్యాక్సిన్ను తయారుచేసిన అమెరికా కంపెనీ ‘ఫైజర్.’. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ను నయం చేసే యాంటీ వైరల్ మాత్రల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మిఖాయెల్ డోల్స్టెన్ వెల్లడించారు. ‘పీఎఫ్ - 07321332’గా పిలిచే ఈ మాత్రలపై పరిశోధనలను 2020 మార్చిలోనే కంపెనీ ప్రారంభించింది. హెచ్ఐవీ రోగుల చికిత్స లో వాడే ‘రిటోనవిర్’ మాత్రలతో కలిపి ‘పీఎఫ్-07321332’ ఔషధాన్ని అందిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ట్రయల్స్లో పరిశీలిస్తున్నారు.