కరోనా కల్లోలం
ABN , First Publish Date - 2020-08-08T06:51:36+05:30 IST
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పదుల కొద్ది మంది ప్రాణాలను బలిగొంటోంది.
ఒకే రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 343 కేసులు నమోదు
మహబూబ్నగర్ జిల్లాలోనే ముగ్గురు మృత్యువాత.
మహబూబ్నగర్(వైద్యవిభాగం) ఆగస్టు 7 : కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పదుల కొద్ది మంది ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజే 343 కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. అందులో నవాబ్పేట మండలానికి చెందిన ఏడాది బాలుడు ఉన్నాడు. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో ఊహించని రీతిలో 160 మంది పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నవాబ్పేట మండలం దేపల్లిలో ఏడాది బాలుడు కరోనాతో నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీ, షాషాబ్గుట్టలో ఇద్దరు చొప్పున మొత్తం ముగ్గురు కరోనా బారిన పడి చనిపోయారు. జిల్లాకేంద్రంలోని వివిధ కాలనీలలో 40 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో అయోధ్యనగర్, రామయ్యబౌళి, వెంకటేశ్వరకాలనీ, రాంనగర్, సుభాష్నగర్, రామకృష్ణ కాలనీ, మేకలబండ, రాజేంద్రనగర్, వీరన్నపేట, మెట్టుగడ్డ, ఎదిర ప్రాంతాలలో ఎక్కువ కేసులు వచ్చాయి.
జడ్చర్లలో 12 మందికి, అడ్డాకుల మండలంలోని కాటవరంలో ఒకటి, జానంపేట, నిజాలాపూర్లో ఒకటి చొప్పున, మండల కేంద్రంలో రెండు, బాలానగర్ మండల కేంద్రంలో నాలుగు, బోడ జానంపేటలో ఒకటి, సీసీకుంటలో రెండు, కురుమూర్తిలో రెండు, పరిపూర్లో ఒకటి, మిడ్జిల్ మండలం వేములలో మూడు, భూత్పూర్ మండలంలోని హస్నాపూర్లో ఒకటి చొప్పున మొత్తం 40 మందికి కరోనా వైరస్ అని తేలింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 160 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని కొవిడ్-19, ర్యాపిడ్ ల్యాబ్లలో 26 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో జిల్లా కేంద్రంలోనే 16 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అలాగే ధరూర్లో నలుగురికి, గట్టులో ఎనిమిది మందికి, మల్దకల్లో ఆరుగురికి, ఇటిక్యాలలో ఎనిమిది మందికి, క్యాతూరులో 18 మందికి, మానవపాడులో ఆరుగురికి, అయిజలో 28 మందికి, వడ్డేపల్లిలో 15 మందికి, రాజోలిలో నలుగురికి, అలంపూర్లో 33 మందికి కరోనా సోకింది.
నారాయణపేట జిల్లాలో మొత్తం 11 మందికి కరోనా సోకింది. ఇందులో జిల్లా కేంద్రంలోని బాహర్పేట్లో ఒకరికి, పళ్లలో ఒకరికి, బాపూనగర్లో ఒకరికి, కొల్లంపల్లిలో ఒకరికి, బొమ్మన్పహాడ్లో ఒకరికి, కోస్గి మండలం హన్మాన్పల్లిలో ఒకరికి, ఊట్కూరులో ముగ్గురికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అలాగే దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్, అటెండర్కు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పీహెచ్సీ వైద్యుడు రవీందర్రెడ్డి తెలిపారు.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 50 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ అధికారికి శ్రీనివాసులు తెలిపారు. అందులో జిల్లా కేంద్రంలో 27 మందికి, గోపాల్పేటలో నలుగురికి, పెబ్బేరులో తొమ్మిది మందికి, కొత్తకోటలో ముగ్గురికి, పెద్దమందడిలో ఇద్దరికి, మదనాపూర్లో ముగ్గురికి, ఆత్మకూర్లో ఇద్దరికి కరోనా సోకింది.
నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 42 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా జిల్లా కేంద్రంలోనే 14 మందికి పాజిటివ్ అని తేలింది. వెల్దండ, అమ్రాబాద్లో ముగ్గురికి చొప్పున, అచ్చంపేటలో నలుగురికి, కొల్లాపూర్, కల్వకర్తిలో ఆరుగురు చొప్పున వైర్ బారిన పడ్డారు.