గులాం నబీ ఆజాద్కు కరోనా
ABN , First Publish Date - 2020-10-17T07:35:57+05:30 IST
రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ (71)కు కరోనా సోకింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 16: రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ (71)కు కరోనా సోకింది. తాను హోం క్వారంటైన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఇప్పటికే అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, అభిషేక్ సింఘ్వీ వైరస్ బారినపడ్డారు. వీరిలో సింఘ్వీ కోలుకోగా, అహ్మద్ పటేల్, 92 ఏళ్ల మోతీలాల్ వోరా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం 8 గంటలకు దేశంలో కొత్తగా 63,371 మందికి వైరస్ సోకిందని, 895 మంది మృతి చెందారని, 70,338 మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది. 8.04 లక్షల యాక్టివ్ కేసులున్నాయని..
8వ రోజూ యాక్టివ్ కేసులు 9 లక్షలలోపే ఉన్నట్లు పేర్కొంది. మరణాల రేటు 1.52కు తగ్గిందని తెలిపింది. ప్రస్తుతం పది లక్షల జనాభాకు 81 మరణాలు నమోదవుతున్నాయని, ప్రపంచంలో ఇదే అతి తక్కువని ప్రకటించింది. దాదాపు రెండు వారాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్రత పెరుగుతోంది. దేశ రాజధానిలో మూడు రోజుల నుంచి 3 వేల పైగా పాజిటివ్లు వస్తున్నాయి.
కాగా, పుణెలో నెల రోజుల నుంచి వైరస్ తగ్గుముఖం పట్టింది. బెంగళూరులో రెండు వారాల నుంచి కరోనా విజృంభిస్తోంది. తాజాగా 3,800 మంది వైరస్ బారినపడ్డారు. బాలీవుడ్ గాయకుడు కుమార్ సానూ(63)కు పాజిటివ్ వచ్చింది. బిహార్ పంచాయతీ రాజ్ మంత్రి కపిల్దేవ్ కామత్(70) కరోనాతో కన్నుమూశారు.
కాగా, వైరస్ నుంచి కోలుకున్నా.. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత వారం బిహార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వినోద్కుమార్ సింగ్(55) కన్నుమూశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కర్ణాటక, కేరళ, బెంగాల్, రాజస్థాన్, ఛత్తీ్సగడ్లకు కేంద్రం ఉన్నత స్థాయి ప్రత్యేక బృందాలను పంపనుంది.