అనాథ శవాల పాలిట ఆత్మబంధువు

ABN , First Publish Date - 2021-05-07T17:12:26+05:30 IST

కరోనా కాటుకు..

అనాథ శవాల పాలిట ఆత్మబంధువు

కొవిడ్‌ మృతదేహాలకు కార్పొరేటర్‌ విజయ్‌ అంత్యక్రియలు


మచిలీపట్నం టౌన్‌: కరోనా కాటుకు గురై మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబ సభ్యులకు సవాలుగా మారింది. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన వారిని స్వస్థలాలకు తీసుకెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే స్థాని కంగానే అంత్యక్రియలకు మొగ్గు చూపుతున్నారు. మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని మృతదేహాలకు కుటుంబ సభ్యులు తలకొరివి పెట్టలేని పరిస్థితి. భౌతికకాయాన్ని చూసేందుకు కూడా కొంతమంది రాని పరిస్థితి.


ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్‌ విజయచంద్రకుమార్‌ మహాప్రస్థానంపై తన అనుయాయులతో వచ్చి మృతదేహాలను స్వయంగా మోసి శ్మశాన వాటికలకు తీసుకువెళుతున్నారు. రాజుపేట, మాచవరం హిందూ శ్మశాన వాటికల వద్ద దహన సంస్కారాలు చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్‌ పరింకాయల శ్రీనివాసరావు తనయుడైన కార్పొరేటర్‌ విజయచంద్రకుమార్‌ తండ్రితో పాటు వెళ్లి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించేవారు. 10రోజులుగా దాదాపు 15 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు. గురువారం 4మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించారు. స్వయంగా వాటి చితికి నిప్పంటించారు.


తండ్రే స్ఫూర్తి: విజయచంద్రకుమార్‌, 2వ డివిజన్‌ కార్పొరేటర్‌

నా తండ్రి పరింకాయల శ్రీనివాసరావు చాలాకాలంగా అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసేవారు. ఆయనతో పాటు నేను వెళుతుండేవాడిని. ఆయన మృతిచెందిన తరువాత ఆ బాధ్యతలను నేను తీసుకున్నా. మచిలీపట్నంలో ఎవరు ఫోన్‌ చేసినా వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాను. కుల, మతాలను పక్కనపెట్టి మృతిచెందిన కరోనా రోగుల దహన సంస్కారాలు చేస్తున్నాను. దీన్ని ఒక దైవ కార్యంగా భావిస్తున్నాను.

Updated Date - 2021-05-07T17:12:26+05:30 IST