ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చాక 30 మందికి మటన్ అమ్మాడు.. దీంతో..
ABN , First Publish Date - 2020-04-01T14:58:56+05:30 IST
నర్మెట మండలం వెల్దండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో మత సమావేశాలకు వెళ్లిరావడంతో...
వెల్దండ నుంచి కుటుంబం తరలింపు..
జనగామ జిల్లా: నర్మెట మండలం వెల్దండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో మత సమావేశాలకు వెళ్లిరావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యాధికారులు అశోక్కుమార్, పూర్ణచందర్లు వారికి పరీక్షలు నిర్వహించి, మంగళవారం ఆ వ్యక్తితో పాటు కుటుంబాన్ని మొత్తం గాంధీ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కాగా, ఢిల్లీలో మత సమ్మేళనానికి వెళ్లి వచ్చిన తర్వాత సదరు వ్యక్తి... యథావిధిగా తాను చేసే మటన్ వ్యాపారాన్ని కొనసాగించాడు.
ఈ నెల 29న గ్రామంలో మేకలను కోసి 30 మందికి పైగా మటన్ను విక్రయించాడు. దీంతో అతడి వద్ద మటన్ను కొనుగోలు చేసిన 30 మందిని పోలీసులు, వైద్యాధికారులు గుర్తించారు. వారు తమ కుటుంబాలతో సహా ఇళ్ల నుంచి వెళ్లొద్దని హోం క్వారంటైన్ విధించి స్టాంపులు వేశారు. గ్రామం మొత్తం హోం క్వారంటైన్ విధిస్తున్నట్లు నర్మెట ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.