ఐఐటీ కోచింగ్ సెంటర్లో కరోనా కలకలం!
ABN , First Publish Date - 2021-06-15T05:04:09+05:30 IST
శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాలకు ఆనుకుని ఉన్న సీతంపేట ఐటీడీఏకి చెందిన ఐఐటీ కోచింగ్ సెంటర్లో కరోనా కలకలం రేగింది. ఐటీడీఏ అధికారుల నిర్లక్షం కారణంగా పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గత నెల 5 నుంచి విద్యాసంస్థలు, వసతిగృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. కాగా, ఐటీడీఏ ఆధీనంలో శ్రీకాకుళంలోని సూపర్-60 పేరుతో నడుస్తున్న గిరిజన విద్యార్థుల ఐఐటీ కోచింగ్ సెంటర్ మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. కరోనా వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పలువురు విద్యార్థులకు పాజిటివ్
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాలకు ఆనుకుని ఉన్న సీతంపేట ఐటీడీఏకి చెందిన ఐఐటీ కోచింగ్ సెంటర్లో కరోనా కలకలం రేగింది. ఐటీడీఏ అధికారుల నిర్లక్షం కారణంగా పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గత నెల 5 నుంచి విద్యాసంస్థలు, వసతిగృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. కాగా, ఐటీడీఏ ఆధీనంలో శ్రీకాకుళంలోని సూపర్-60 పేరుతో నడుస్తున్న గిరిజన విద్యార్థుల ఐఐటీ కోచింగ్ సెంటర్ మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వందమంది విద్యార్థులను వసతిగృహాల్లో ఉంచి, భోజన వసతి సదుపాయాలు కల్పించి శిక్షణ అందిస్తున్నారు. కరోనా వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కొందరు విద్యార్థులు అనారోగ్యానికి గురి కాగా, అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. సుమారు 20మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయని విశ్వసనీయంగా తెలిసింది. వారిని స్థానిక కొవిడ్కేర్కు తరలించినట్టు సమాచారం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వసతిగృహంలో మిగిలిన విద్యార్థులు, బోధకులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా ఉంటున్న ఒక ఐటీడీఏ అధికారి కరోనా రెండోదశ విజృంభణ కాలంలోనూ అత్యుత్సాహంతో ఐఐటీ శిక్షణ కేంద్రాన్ని కొనసాగించడంతో సమస్య ఉత్పన్నమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, విద్యార్థులకు కరోనా సోకడంపై శిక్షణ కేంద్రం నిర్వాహకుడు గున్న రామ్మోహన్రావును వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఆయన ఫోన్కు అందుబాటులో లేరు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రానాయక్ వద్ద ప్రస్తావించగా, గిరిజన విద్యార్థులకు పాజిటివ్ వచ్చిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై వివరాలు సేకరించి చెబుతామని తెలిపారు.
కరోనాతో మరో నలుగురి మృతి
జిల్లాలో కరోనా బారిన పడి సోమవారం మరో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 670కి చేరింది. సోమవారం 4,829 మంది నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపగా, 228 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ బాధితుల సంఖ్య 1,14,992 చేరుకుంది. వీరిలో చాలామంది కోలుకోగా, సోమవారం కొవిడ్ ఆస్పత్రి నుంచి 427 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,321 ఉన్నాయి. హోం ఐసోలేషన్లో 3,530 మంది, కొవిడ్ కేర్ సెంటర్లలో 255 మంది, కొవిడ్ ఆస్పత్రుల్లో 536 మంది చికిత్స పొందుతున్నారు.