కరోనా తొలగాలి.. కొత్త ఉషస్సులు రావాలి
ABN , First Publish Date - 2021-04-13T06:09:18+05:30 IST
తెలుగుసంవత్సరాది పండుగ ఉగాదిని తెలుగువారి జీవితాల్లో కొత్త ఉషస్సులు నింపేదిగా భావిస్తారు. ఏటా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కరోనాతో గతేడాది ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఉగాదికి పరిస్థితి కుదుటపడుతుందనుకున్న వేళ కొవిడ్ రెండోవేవ్ ఉధృతమైంది. మంగళవారం నుంచి ప్రారంభ మయ్యే ప్లవనామ సంవత్సరంలోనైనా కరోనా తొలగిపోవాలని, కొత్త ఉషస్సులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
- నేడు ఉగాది పర్వదినం
- ప్లవనామ సంవత్సరంలో వైరస్ను తిప్పికొట్టాలి
- ఇంట్లో ఉంటేనే ఆరోగ్యానికి ధీమా
- పంచాగ శ్రవణాల్లో జాగ్రత్తలు పాటించాలి
- కట్టడి లేకపోతే వైరస్ వ్యాప్తికి ఊతం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తెలుగుసంవత్సరాది పండుగ ఉగాదిని తెలుగువారి జీవితాల్లో కొత్త ఉషస్సులు నింపేదిగా భావిస్తారు. ఏటా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కరోనాతో గతేడాది ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఉగాదికి పరిస్థితి కుదుటపడుతుందనుకున్న వేళ కొవిడ్ రెండోవేవ్ ఉధృతమైంది. మంగళవారం నుంచి ప్రారంభ మయ్యే ప్లవనామ సంవత్సరంలోనైనా కరోనా తొలగిపోవాలని, కొత్త ఉషస్సులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కట్టడి నేర్పిన శార్వరి
శార్వరి నామ సంవత్సరం ఇంట్లో ఉంటేనే ఆరోగ్యానికి ధీమా అంటూ కట్టడిని నేర్పింది. ఏడాది పొడవునా జిల్లాలో కరోనాతో అనేక ఇబ్బందులు తలెత్తాయి. లాక్డౌన్, కర్ఫ్యూలు, హోం క్వారంటెన్లు, మృత్యుఘోష వంటి అనేక దృశ్యాలు కనిపించాయి. పరిస్థితి కుదుటపడుతోందని అనుకుంటున్న వేళ శార్వరి కరోనా ఉధృతినే మిగిల్చి వెళ్తోంది. గత సంవత్సరం కాలం కంటే వేగంగా రెండు నెలల కాలంలోనే పాజిటివ్ కేసులు పెరిగాయి. శార్వరి పోతూ పోతూ నేర్పిన గుణపాఠాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్లవ నామ సంవత్సరంలో ఇంట్లోనే ఉండి ఉగాది పచ్చడితో కరోనాను తరమడానికి నిబంధనలు పాటిస్తామని ముందడుగు వేయాలి. గత సంవత్సరం ఉగాది సమయంలో లాక్డౌన్తో రవాణా సౌకర్యం బంద్ ఉండడంతో ప్రజలు పండుగను ఇళ్లలోనే జరుపుకున్నారు. బంధువుల రాకపోకలు కూడా లేవు. ఈ సారి లాక్డౌన్ లేకపోవడం, ప్రయాణ సౌకర్యం ఉండడంతో పండుగ వేళ రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లలో సందడి కూడా మొదలైంది. సెకండ్ వేవ్తో కరోనా విజృంభిస్తున్నా కట్టడి కనిపించడం లేదు. పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో వచ్చిన ప్లవ నామ సంవత్సర ఉత్సవాలను ఇంట్లోనే ఉండి జరుపోవాల్సిన అవసరముంది. ఉగాది పచ్చడితో కరోనాను తరమడానికి నిబంధనలు పాటిస్తామని ముందడుగు వేయాలి.
తెలుగు లోగిళ్లలో అనందాలు నింపాలని...
తెలుగు లోగిళ్లలో ఉగాది పండుగ అనందాల్ని నింపాలని అకాంక్షిస్తూ శ్రీ ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. వేప పువ్వు, లేత మామిడికాయల ముక్కలు, కొత్త చింతపండు పులుసు, కొత్త బెల్లం పానకంతో తయారు చేసిన ఉగాది పచ్చడి పండుగ ప్రత్యేకత. ఇరుగు, పొరుగు వారిని పిలిచి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పచ్చడిని అందిస్తారు. కరోనా వైరస్తో ఈ సంప్రాదాయానికి బ్రేక్ పడింది. కొవిడ్ నిబంధనల మేరకు పంచాంగ శ్రావణం, కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.