శ్రీశైలంలో కరోనా ఆంక్షలు
ABN , First Publish Date - 2021-04-17T05:31:44+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
- మధ్యాహ్నం వరకే దుకాణాలు
శ్రీశైలం, ఏప్రిల్ 16: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలంలో కేసులు పెరుగుతుండడంతో క్షేత్ర పరిధిలోని దుకాణాలను ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరవాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు క్షేత్ర పరిధిలో 96 కేసులు నమోదయ్యాయి. భక్తులు కొవిడ్ నిబంధనల పాటించేలా చర్యలు చేపట్టారు. క్షేత్రంలో జనసంచారం తక్కువ ఉండేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మూసుకున్న కోవెల తలుపులు
బన గానపల్లె, ఏప్రిల్ 16: యాగంటి ఆలయం తలుపులు మూతపడ్డాయి. కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాగంటి క్షేత్రం తలుపులు ఆలయ ఈవో డీఆర్కేవీ ప్రసాద్, ఆలయ పూజారి మహేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం మూసివేశారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా ఢిల్లీ ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకు ఆర్కియాలజీ అధికారులు నాగిరెడ్డి, శ్రీనివాసులు ప్రధాన ఆలయంలోని వాకిలిని, గాలిగోపురం వద్ద ఉన్న గేటుకు తాళాలు వేశారు. ఆలయ ఈవో డీఆర్కేవీ ప్రసాద్ మాట్లాడుతూ మే 15వ తేదీ వరకు యాగంటి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉమామహేశ్వర స్వామి వారికి నిర్ణీత కాల పూజలు, ఇతర సేవలు యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 5 గంటలకు, సాయత్రం 5గంటలకు అర్చకులతో పూజలు చేస్తారని తెలిపారు. ఆలయం మూసేసిన విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.