రికవరీ రేటు.. ప్రపంచంలో మనమే టాప్! అమెరికాను వెనక్కు నెట్టి..

ABN , First Publish Date - 2020-09-19T19:55:31+05:30 IST

కరోనా రోగుల రికవరీ రేటులో భారత్ అమెరికాను సైతం వెనక్కు నెట్టి ప్రపంచంలోనే నెం. 1 స్థానానికి చేరుకుంది. ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖకు చెందిన లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ దాదాపు 42 లక్షల మంది కరోనాను ఓడించారు. 41 లక్షల మంది అమెరికన్లు కరోనాను జయించడంతో..ఆ దేశాన్ని వెనక్కు నెట్టి భారత్ తొలిస్థానాన్ని ఆక్రమించింది.

రికవరీ రేటు.. ప్రపంచంలో మనమే టాప్! అమెరికాను వెనక్కు నెట్టి..

న్యూఢిల్లీ: కరోనా రోగుల రికవరీ రేటులో భారత్ అమెరికాను సైతం వెనక్కు నెట్టి ప్రపంచంలోనే నెం. 1 స్థానానికి చేరుకుంది. ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖకు చెందిన లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ దాదాపు 42 లక్షల మంది కరోనాను ఓడించారు. ప్రపంచవ్యప్తంగా కోలుకున్న వారిలో ఇది 19 శాతానికి సమానం. 41 లక్షల మంది అమెరికన్లు కరోనాను జయించడంతో..ఆ దేశాన్ని వెనక్కు నెట్టి భారత్ తొలిస్థానాన్ని ఆక్రమించింది. 


అధికారిక లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 79.28 శాతానికి చేరుకుంది. కేంద్రం అనుసరిస్తున్న పిటిష్టమైన వ్యూహాల కారణంగానే ఇది సాధ్యమైందని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాధిగ్రస్థుల్ని వీలైనంత త్వరగా గుర్తించడంతో పాటు, అనుమానితుల్ని, వారిని కలుసుకున్న వారిని వేగంగా గుర్తించి వీలైనన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా రికవరీ రేటు పెరిగిందని తెలిపింది. 


అయితే..కరోనా కేసుల పరంగా ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోని 17 శాతం కరోనా కేసులు దేశంలో నమోదైనవే. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇప్పటివరకూ దాదాపు 17 లక్షల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో జులై నెలలో 7.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు( ప్రస్తుతం జరుపుతున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవి) 10.58 శాతానికి చేరుకున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-09-19T19:55:31+05:30 IST