కలెక్టరేట్లో ఇద్దరికి.. అటవీశాఖ కార్యాలయంలో ఒకరికి కరోనా..
ABN , First Publish Date - 2020-06-29T17:06:08+05:30 IST
భూపాలపల్లి కలెక్టరేట్లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
భూపాలపల్లి కలెక్టరేట్లో ఇద్దరికి కరోనా
భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లి కలెక్టరేట్లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈమేరకు జిల్లా సర్వేలెన్స్ అధికారి జైపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న 35 మంది శాంపిల్స్ సేకరించామని పేర్కొన్నారు. 13 మంది శాంపిల్స్ను పరీశీలించగా ఇద్దరికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. 11 మందికి నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
అటవీ శాఖ అధికారికి పాజిటివ్
గోవిందరావుపేట: పస్రా అటవీ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అ ధికారికి కరోనా వైరస్ సోకింది. ఇటీవల శిక్షణ కోసం హైదరాబాద్కు వెళ్లిన ఆయన అక్కడి ప్రైవేటు డయాగ్నోసిస్ సెంటర్లో శాంపిల్స్ ఇచ్చారు. ఆ తర్వాత నేరుగా పస్రాకు వచ్చి విధుల్లో చేరారు. ఈ క్రమంలో రిపోర్టు పాజిటివ్గా వచ్చింది. విషయం తెలుసుకున్న వైద్యశాఖ అధికారులు ప్రైమరీ కాంటాక్టుల వివరాలను సేకరించారు. మొత్తం ఆరుగురు ఆయనతో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. తనకు వైరస్ సోకినట్లు తెలుసుకున్న ఆ అధికారి వెంటనే హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోగా ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించిన వారు కూడా ప్రస్తుతం ఇళ్లలోనే ఉన్నారు. వారందరికీ సోమవారం పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య తెలిపారు.