టెస్టు చేయించుకోకుండానే.. కరోనా నెగెటివ్ అంటూ మొబైల్కు మెసేజ్
ABN , First Publish Date - 2020-08-03T17:02:10+05:30 IST
పరీక్ష చేయకుండానే ఓ వ్యక్తికి నెగెటివ్ రిపోర్టు ఇచ్చిన ఘటన ములుగు ఏరియా వైద్యశాలలో ఆదివారం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన
ములుగు (ఆంధ్రజ్యోతి): పరీక్ష చేయకుండానే ఓ వ్యక్తికి నెగెటివ్ రిపోర్టు ఇచ్చిన ఘటన ములుగు ఏరియా వైద్యశాలలో ఆదివారం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నాడు. అక్కడ తన సహచర ఉద్యోగికి కరోనా సోకడంతో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఆయన ములుగు ఏరియా వైద్యశాలలో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చాడు.
అయితే అతని వివరాలు, ఫోన్నెంబర్ను తీసుకున్న వైద్యసిబ్బంది.. మరునాడు వస్తే శాంపిళ్లు తీసుకుంటామని చెప్పారు. అయితే ఆ తర్వాత సదరు ఉద్యోగి మొబైల్కు ‘వైరస్ నెగెటివ్’ అంటూ.. ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ విషయమై డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్యను ఫోన్లో వివరణ కోరగా.. కరోనా శాంపిళ్ల సేకరణ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది తప్పిదమని, పరీక్ష జరిగిందో.. లేదో తెలుసుకోకుండా ఆన్లైన్ చేయడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు. ఇటువంటి పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.