వామ్మో కరోనా వైద్యం
ABN , First Publish Date - 2021-05-17T06:01:24+05:30 IST
కరోనా మహమ్మారి దెబ్బకు నిరుపేదలు, మధ్య తరగతి, ధనికులనే తారతమ్యం లేకుండా అందరూ కుదేలవుతున్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వారు వైరస్ నియంత్రణకు ఎడాపెడా మందులు కొనుగోలు చేసేస్తున్నారు.
జీజీహెచ్ (కాకినాడ), మే 16: కరోనా మహమ్మారి దెబ్బకు నిరుపేదలు, మధ్య తరగతి, ధనికులనే తారతమ్యం లేకుండా అందరూ కుదేలవుతున్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వారు వైరస్ నియంత్రణకు ఎడాపెడా మందులు కొనుగోలు చేసేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని... ఇంటి వద్దనే ఉంటూ ముందస్తు స్వీయ జాగ్రత్తల పేరుతో డాక్టర్ల సిఫార్సులు, మెడికల్ షాపుల నిర్వాహకుల సూచనలతో మందులు వాడుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని కరోనా పేరు చెప్పి ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపుల వారు అందినకాడికి ప్రజలను దోచుకుంటున్నారు. చిన్నపాటి లక్షణాలే కధా అని ఇంటి దగ్గర ఉండి చికిత్స తీసుకునేవారిని సైతం వదలకుండా మందుల ధరలను అమాంతంగా పెంచేసి ముక్కుపిండి డబ్బులు గుంజేసే పనిలో ఉన్నారు. ధరల నియంత్రణపై అధికారుల పర్యవేక్షణ కానరావట్లేదు.
పల్స్ ఆక్సీమీటర్ రూ.3వేలు !
ఇది
కొవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. సెకండ్ వేవ్
విజృంభిస్తున్న తరుణంలో డాక్టర్లు దీనిని రికమెండ్ చేస్తున్నారు. దీంతో
ఫార్మా కంపెనీలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రీతిలో దీని ధరను
అమాంతంగా పెంచేశాయి. కొవిడ్ లక్షణాలున్న వారి ఆరోగ్య పరిస్థితి, ఆక్సిజన్
లెవెల్స్ స్థాయిని అంచనా వేసుకునేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తోంది.
పాజిటివ్ వచ్చిన వారు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, ఆక్సిజన్
శాచ్యురేషన్ స్థాయి ఏ మేరకు ఉందో పరిశీలించుకునేందుకు వినియోగించే పల్స్
ఆక్సీమీటర్ ధర కరోనాకు ముందు రూ.550 మాత్రమే. మొదటి దశలో రూ.850 నుంచి
రూ.2వేలు పలికింది. రెండో దశ వచ్చేసరికి అమాంతంగా రూ.2,500 నుంచి రూ.3
వేలకు పెంచేశారు.
వైరస్ నియంత్రణకు ఉపయోగించే మందుల ధరలనూ అమాంతంగా
పెంచేశారు. ఐవర్మెక్టిన్ పది ట్యాబెట్ల ధర మొన్నటి వరకు రూ.50-70 ఉండేది.
ప్రస్తుతం మూడు రెట్లు పెంచేసి రూ.300కు విక్రయిస్తున్నారు. ఫ్ల్లోమీటర్
వాల్వ్ గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.5 వేలకు విక్రయిస్తున్నారు.
జ్వరానికి ఉపయోగించే డోలో, పారాసిటమాల్, యాంటీ బయోటిక్గా అంతా వాడుతున్న
డాక్సీవైక్లిన్, అజిత్రోమైసిన్, విటమిన్-సి, జింక్ మాత్రల రేట్లు కూడా
బాగా పెరిగిపోయాయి. కొవిడ్ బారిన పడి ప్రాణాపాయస్థితిలో ఉపయోగించే
రెమ్డిసివిర్ ఇంజక్షన్ ఎమ్మార్పీ రూ. 2,464 కాగా బ్లాకులో అవసరాన్ని
బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేలు వరకు విక్రయిస్తున్నారు. రాజమహేంద్రవరంలో
ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఓ ముఠాతో పాటు ఓ ఫార్మా
కంపెనీని డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించి ఇటీవల అరెస్టు చేశారు.