గుండె పగిలిన విషాదం

ABN , First Publish Date - 2020-06-30T11:12:25+05:30 IST

పామూరుకు చెందిన 47 సంవత్సరాల వ్యక్తికి..

గుండె పగిలిన విషాదం

కరోనా భయంతో వ్యక్తి మృతి

పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం

కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కు

అనాథ శవంగా ఖననం


పామూరు(ప్రకాశం): పామూరుకు చెందిన 47 సంవత్సరాల వ్యక్తికి జ్వరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆయన శ్వాబ్‌, రక్తనమూనాలు సేకరించారు. గతం నుంచే ఆయనకు బీపీ, షుగర్‌తోపాటు గుండె సంబంధమైన సమస్య కూడా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా భయంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఆతర్వాత వచ్చిన ఫలితాల్లో అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌లోని శవాగారానికి తరలించారు. అందరూ ఉన్నా రెండు రోజులపాటు అనాథలా అక్కడే ఉంచారు.


రాత్రి ఆయన భార్య, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో వారు అధికారులను తొలుత ప్రతిఘటించారు. తామే స్వచ్ఛందంగా ఒంగోలుకు తీసుకువస్తే సరైన వైద్యం అందించలేదని, అందుకే ఆయన మృతి చెందాడని మండిపడ్డారు. మమ్మల్ని కూడా పరీక్షల పేరుతో చంపేందుకు తీసుకువెళ్తున్నారా అంటూ నిలదీశారు. అనంతరం ప్రాథేయపడ్డారు. భర్త మృతదేహం సోమవారం ఉదయం పామూరుకు తీసుకొస్తున్నారని కడసారి చూసుకుని వస్తానని మృతుని భార్య అధికారులను వేడుకున్నప్పటికీ వారు నిస్సహాయతను వ్యక్తం చేశారు.


దీంతో విధిలేని పరిస్థితుల్లో మృతుడి భార్య, కుటుంబ సభ్యులు ఒంగోలులోని క్వారంటైన్‌కు వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆ ఇంటి పెద్ద మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో నేరుగా పామూరులోని ముస్లిం శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. క్రిమసంహారక ద్రావణంతో ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. ఆయన అన్నదమ్ములు, బంధువులను ఎవ్వరినీ కూడా కడసారి చూసేందుకు అనుమతివ్వలేదు. 

Updated Date - 2020-06-30T11:12:25+05:30 IST