ఆసుపత్రి నిర్లక్ష్యం: ఎండలో మాడిన కరోనా బాధిత మహిళతో పాటు ఇద్దరు పిల్లలు
ABN , First Publish Date - 2020-05-26T16:11:26+05:30 IST
యూపీలోని ఘజియాబాద్లోగల కంబైన్డ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఆసుపత్రి సిబ్బంది తీరుతో కరోనా...
ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్లోగల కంబైన్డ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఆసుపత్రి సిబ్బంది తీరుతో కరోనా సోకిన మహిళ తన ఇద్దరు శిశువులతో పాటు రెండు గంటలు చుర్రుమనే ఎండలో కూర్చోవలసి వచ్చింది. కరోనా పాజిటివ్ రిపోర్టు చూపించాలని బాధితురాలిని ఆసుపత్రి సిబ్బంది కోరింది. దీంతో ఆమె ఉన్నత వైద్యాధికారులకు ఫోను చేయడంతో ఆసుపత్రి సిబ్బంది ఆ మహిళతోపాటు ఆమె పిల్లలకు బెడ్ కేటాయించారు. వివరాల్లోకి వెళితే మే 22 న విజయనగర్లోని సిద్ధార్థ్ విహార్లో ఉంటున్న గర్భిణి సాధారణ తనిఖీ కోసం జిల్లా మహిళా ఆసుపత్రికి వెళ్లింది. మే 23 న ఆ మహిళ కవలలకు జన్మనిచ్చింది. మే 24 న డిశ్చార్జ్ అయ్యింది. అయితే ఆమెకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆమె తన కవల శిశువులతో కలిసి కంబైన్డ్ ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆసుపత్రి సిబ్బంది ఆమెను శిశువులతో సహా మీరట్కు వెళ్లాలని సూచించారు. ఈ నేపధ్యంలో ఆసుపత్రి సిబ్బంది బాధితురాలితో పాటు శిశువులను రెండు గంటల పాటు ఎండలోనే ఉంచింది. ఈ ఉదంతం పైఅధికారులకు చేరడంతో వారు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఈ విషయమై దర్యాప్తు చేపట్టారు.