బ్యాంకులకు కోవిడ్ గండం
ABN , First Publish Date - 2020-04-07T05:52:07+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి ప్రభావం భారత బ్యాంకింగ్ రంగంపై భారీగానే పడనుంది. కనీవినీ ఎరుగని ఈ విపత్తు కారణంగా బ్యాంకు ల రుణ వ్యయ నిష్పత్తి 13 శాతం, మొండి బకాయిలు (ఎన్పీఏ) 1.9 శాతం పెరిగిపోతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్...
- దూసుకుపోనున్న ఎన్పీఏలు
ముంబై: కోవిడ్-19 మహమ్మారి ప్రభావం భారత బ్యాంకింగ్ రంగంపై భారీగానే పడనుంది. కనీవినీ ఎరుగని ఈ విపత్తు కారణంగా బ్యాంకు ల రుణ వ్యయ నిష్పత్తి 13 శాతం, మొండి బకాయిలు (ఎన్పీఏ) 1.9 శాతం పెరిగిపోతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తేల్చిచెప్పింది. ‘‘ఆసియా పసిఫిక్ ప్రాంత బ్యాంకులు, కోవిడ్-19 సంక్షోభ ప్రభావం 300 బిలియన్ డాలర్లు’’ పేరిట ఆ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. చైనాలో ఎన్పీఏల పెరుగుదల అంచనా 2 శాతం కన్నా మన బ్యాంకులకు ఇచ్చిన అంచనా 0.1 శాతం తక్కువని సంస్థ క్రెడిట్ విశ్లేషకుడు గావిన్ గన్నింగ్ తెలిపారు. కరోనా ప్రభావం ఎంత దీర్ఘకాలం పాటు సాగితే అంతగా ఆర్థిక కష్టాలు పెరిగిపోతాయని ఆయన అన్నారు.
ప్రధానంగా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు విముఖత ప్రదర్శించడంతో రుణాల పోర్ట్ఫోలియో కూడా క్షీణిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్లతో పోల్చితే బ్యాంకులపై ప్రారంభంలో కోవి డ్ ప్రభావం తక్కువగా ఉన్నం దు వల్ల ఇప్పుడు అది మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోని 20 బ్యాంకింగ్ విభాగాల రేటింగ్లు కూడా తీవ్రంగా ప్రభావితం కావచ్చునని ఆ నివేదిక హెచ్చరించింది. వాస్తవానికి ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన రుణ వాయిదాల మారటోరియం వంటి విధానపరమైన చర్య లు పైకి తేలిగ్గానే కనిపించినా బ్యాంకులపై ఆ వ్యయభారం అధికంగానే ఉంటుందని కూడా హెచ్చరించింది.