కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-06-18T04:50:35+05:30 IST
కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి
రాయచోటి, జూన్17: కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాయచోటి మండల తహసీల్దార్ సుబ్రహ్మణ్యంరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్-19 రెండో వేవ్ ఎంతో మందిని బలి తీసుకుందన్నారు. ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆక్సిజన్ కోతతో మృతి చెందిన కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని, తెల్ల రేషన్కార్డు కల్గిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు. జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు, చిరువ్యాపారులకు, వృత్తిదారులకు రూ.10 వేలు చెల్లించాలన్నారు. రైతుల వద్ద నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వారికి రూ.50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విధి నిర్వహణలో చనిపోయిన పారిశుధ్య కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాషా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్వలి, నరసారెడ్డి, అనుంపల్లె రాంప్రసాద్రెడ్డి, మైనార్టీ నాయకులు అతావుల్లా, అబుజర్, నూలివీడు శివారెడ్డి, మైనుద్దీన్, ఖలీం, మహబూబ్అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.