మరో ఇద్దరికి కరోనా..!
ABN , First Publish Date - 2020-05-25T10:18:55+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. కొత్త కేసులు రాకపోగా.. కరోనాను జయించి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ ..
ఆ ఇద్దరు కువైత్, ఖత్తర్ నుంచి వచ్చిన వారే
పెరుగుతున్న కువైత్ కరోనా కేసులు
క్వారంటైన్లో కట్టుదిట్టం చేసిన అధికారులు
ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల చెందిన ఇద్దరు డిశ్చార్జి
జిల్లాలో కరోనా అదుపులోకి వచ్చినా.. కువైత్ కలకలం సృష్టిస్తోంది
కడప, మే 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. కొత్త కేసులు రాకపోగా.. కరోనాను జయించి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాస్తవంగా జిల్లాలో 112 మందికి కరోనా సోకితే.. వారిలో 85 మంది కోలుకున్నారు. అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కువైత్ కలకలం సృష్టిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన జిల్లా వాసులు స్వదేశానికి వచ్చేందుకు 6 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా అధికారులు పేర్కొన్నారు. తొలివిడత గా 113 మంది శుక్రవారం తెల్లవారుజామున జిల్లాకు చేరుకున్నారు. వారిని రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల క్వారంటైన్లో ఉంచారు. కరోనా టెస్టులు చేయగా శనివారం 12 మందికి పాజిటివ్ వచ్చింది.
గల్ఫ్ దేశాలైన కువైత్, ఖత్తర్ నుంచి వచ్చిన ఓబులవారిపల్లె, కమలాపురానికి చెందిన మరో ఇద్దరికి ఆదివారం పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిలో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో కలిపితే జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 126కు చేరింది. జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని ఉంచిన క్వారంటైన్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైర్సను కట్టడి చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా యంత్రాంగం పేర్కొంటోంది.
ఇద్దరు డిశ్చార్జ్
తిరుపతి స్టేట్ కోవిడ్-19 ఆసుపత్రి (స్విమ్స్)లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు, కమలాపురానికి చెందిన ఒక్కొక్కరు ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పోరాడి జయించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.2 వేలు ఆర్థిక సాయం, డ్రై ఫ్రూట్స్, ఇతర సామగ్రి అందజేసి వారి గ్రామాల్లో అధికారులు వదిలారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 88కి చేరింది. ఎర్రగుంట్లలో 12 మందికి కరోనా సోకితే 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రొద్దుటూరులో 42 మందికి గాను 37 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఐదుగురు చికిత్స పొందుతున్నారు. కడపలో 28 మంది బాధితులకు గాను 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది చికిత్స పొందుతున్నారు. వారంతా బీకేఎం స్ర్టీట్కు చెందినవారే. బద్వేలు మండలంలో ఐదుగురికి గాను నలుగురు డిశ్చార్జ్ కాగా కొత్తగా పాజిటివ్ వచ్చిన ఒకరు ఫాతిమా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.
కరోనా అప్డేట్స్
పట్టణం మొత్తం డిశ్చార్జి
కడప 28 20
ప్రొద్దుటూరు 42 37
పులివెందుల 4 4
వేంపల్లె 2 2
బద్వేలు 5 4
మైదుకూరు 4 4
ఎర్రగుంట్ల 12 12
కమలాపురం 1 1
సీకేదిన్నె 1 1
చెన్నూరు 2 2
పుల్లంపేట 1 1
సంబేపల్లె 1 --
జమ్మలమడుగు 1 --
చిట్వేలు 1 --
రాయచోటి 1 --
ఓబులవారిపల్లె 1 --
ఇతరులు 5 --
కువైత్ నుంచి వచ్చిన వారు 14 ---
మొత్తం 126 88
జిల్లాలో కరోనా వైరస్ శాంపిల్స్ రిజల్ట్స్
మొత్తం శాంపిల్స్ ః 26920
రిజల్ట్స్ వచ్చినవి ః 26213
నెగటివ్ ః 26087
పాజిటివ్ ః 126
రిజల్ట్స్ రావలసినవి ః 707
మే 24 వ తేదీ తీసిన శాంపిల్స్ ః 915