జిల్లాలో మరో ఐదుగురికి కరోనా
ABN , First Publish Date - 2020-05-30T11:02:49+05:30 IST
జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు జిల్లా
తిరుపతి, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. గురువారం ఉదయం నాగలాపురం మండలంలో మూడు, సదుం (అజ్మీర్ లింకు), విజయపురం, రేణిగుంటల్లో ఒక్కొక్కటి చొప్పున ఆరు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సాయంత్రం తర్వాత బంగారుపాళ్యం, నిండ్ర మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం ఎనిమిది కేసులు నమోదైనట్టయింది.
ఇక శుక్రవారం తిరుపతి మండలం దామినేడు, శ్రీకాళహస్తిలో ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. బంగారుపాళెం యువకుడు తమిళనాడు నుంచి స్థానికంగా ఫ్యాక్టరీలో పనిచేసే కూలీగా.. నిండ్ర మండలంలో వ్యక్తి మహారాష్ట్ర నుంచి స్వస్థలం వచ్చినట్టు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 271కి చేరుకుంది. బంగారుపాళెం మండలంతో కలుపుకొంటే వైరస్ 39 మండలాలకు వ్యాపించినట్టయింది. వీటిలో 36 మండలాల్లో ప్రత్యక్షంగా.. అజ్మీర్ కేసుల కారణంగా పాకాల, పులిచెర్ల, సదుం మండలాలు కూడా ఈ జాబితాలో చేరాయి.