కరోనా భయం.. భయం...
ABN , First Publish Date - 2020-07-04T10:58:19+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 17 కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు.
ఒకేరోజు 17 కరోనా పాజిటివ్ కేసులు
అందులో ఇద్దరు వైద్యులు
వనపర్తి జిల్లాలో మరో కోవిడ్ మరణం
మహబూబ్నగర్/ వనపర్తి (వైద్యవిభాగం)/ గద్వాల క్రైం/ జడ్చర్ల, జూలై 3 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 17 కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు. పాలమూరు పట్టణంలోనే తొమ్మిది కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ జిల్లాలో అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. మొత్తం కేసుల్లో ఎస్వీఎస్ వైద్య కళాశాలకు చెందిన ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. సెయింట్ మేరీస్ విద్యా సంస్థల యాజమాన్యానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈయన ఐదు రోజుల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు. రిపోర్టు మాత్రం శుక్రవారం వచ్చింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. దీంతో పాటు కొత్తగంజ్కు చెందిన 52 ఏళ్ల వ్యక్తికి, మర్లు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి, శ్రీనివాసకాలనీకి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ అని నిర్ధారించారు. కొత్త చెరువులో ఇద్దరికి, ఎస్ఎస్ గుట్టలో ఒకరికి నిర్ధారణ అయ్యింది. బాదేపల్లిలో ఒకరికి, జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో ఇద్దరికి, బాలానగర్ మండల కేంద్రంలో ఒక్కరికి కరోనా పాజిటివ్ అని తేలింది.
వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం రెండో కరోనా మరణం నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన 65 సంవత్సరాల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు చికిత్స కోసం పంపగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి ప్రథమ కాంటాక్టు కింద సేకరించిన శాంపిళ్లలో ఆమె కోడలికి పాజిటివ్గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధి కాలనీకి చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లా అప్పిరెడ్డిపల్లిలో ఓ మహిళలకు, నర్వ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.