విజయనగరం జిల్లాలో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా
ABN , First Publish Date - 2020-07-09T01:12:34+05:30 IST
జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అన్ని మండలాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. విజయనగరంలో ఇటీవల కాలంలో కరోనా విజృంభిస్తోంది.
విజయనగరం: జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అన్ని మండలాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. విజయనగరంలో ఇటీవల కాలంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం జిల్లాలో రికార్డు స్థాయిలో 43 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 475కు కరోనా కేసులు చేరాయి. ముఖ్యంగా విజయనగరం పట్టణంలో కరోనా భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ రోజు నమోదైన 43 కేసుల్లో 27 కేసులు విజయనగరం పట్టణంలోని నేమోదు కావడం విశేషం. అధికంగా కేసులు నమోదవుతుండడంతో విజయనగరం వాసులు టెన్షన్ పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. ప్రజల్లోనూ కొన్ని లోపాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మార్కెట్కు వచ్చే వారు భౌతిక దూరం పాటించడం లేదు. ఒకే దుకాణంలో గుంపుగా జనం కనిపిస్తున్నారు. మాస్క్లు పెట్టుకోవడం లేదు. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దశలో ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు.