కోలుకున్న తర్వాత 8 రోజుల దాకా శరీరంలోనే: చైనా
ABN , First Publish Date - 2020-03-29T09:34:25+05:30 IST
కరోనా చికిత్సపొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా 8 రోజుల దాకా రోగి శరీరంలో
బీజింగ్, మార్చి 28 : కరోనా చికిత్సపొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా 8 రోజుల దాకా రోగి శరీరంలో వైరస్ ఉండే అవకాశాలు ఉంటాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్యకాలంలో బీజింగ్లోని పీఎల్ఏ జనరల్ ఆస్పత్రిలో కొవిడ్-19 చికిత్సపొంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయిన 16 మంది రోగుల ఆరోగ్యాల్లో వచ్చిన మార్పులను విశ్లేషించడంతో ఈవిషయం వెల్లడైంది. ఇళ్లకు వెళ్లిపోయిన రోగులందరి నుంచి ఒకరోజు తప్పించి ఒకరోజు గొంతులోని స్రావాల శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపారు. దీంతో వారిలో సగం మంది(8 మంది) శ్వాసకోశ వ్యవస్థలో ఇప్పటికీ కరోనా వైరస్ జాడ ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిస్థితుల్లోనూ వారిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు. ఈక్రమంలో వారు ఎవరినైనా కలిస్తే సులువుగా వైరస్ సంక్రమించే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్త లోకేశ్ శర్మ(యేల్ వర్సిటీ) కూడా భాగస్తులయ్యారు.