కరోనా ఎఫెక్ట్.. రహదారిని దిగ్బంధం చేయాలనుకున్న అధికారులు.. అడ్డుకున్న వ్యాపారులు
ABN , First Publish Date - 2020-07-07T20:13:45+05:30 IST
రాజంపేట పట్టణంలో ఈడిగపాలెంలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో రెడ్జోన్గా ఏర్పాటు చేసి కడప-చెన్నై రహదారిని
రెడ్జోన్గా మెయిన్రోడ్డు ప్రకటనపై వ్యాపారుల ఆందోళన
రాజంపేట టౌన్ (కడప) : రాజంపేట పట్టణంలో ఈడిగపాలెంలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో రెడ్జోన్గా ఏర్పాటు చేసి కడప-చెన్నై రహదారిని దిగ్బంధం చేయాలన్న అధికారుల ఆలోచనలకు వ్యాపారస్థులు అడ్డు తగిలారు. నెల రోజుల కిందట ఈడిగపాలెం ప్రాంతంలో కరోనా పాజిటివ్ రావడంతో ఏకంగా నెల రోజులు ప్రధాన రహదారిని దిగ్బంధం చేశారని, మూడు రోజుల క్రిందట గడువు ముగియడంతో తిరిగి రహదారి పునరుద్ధరించారని, ఈ సమయంలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో రహదారిని దిగ్బంధం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
ప్రధాన రహదారిలోని పోస్ట్ఆఫీసు నుంచి అమ్మవారి శాల వరకు ఉన్న ప్రాంతంలోని వ్యాపారస్థులందరూ ఏకమై ఆందోళన చేశారు. నెల రోజులు రోడ్లు దిగ్బంధం చేయడం వల్ల జీవన భృతి కోల్పోయామని, తిరిగి ప్రధాన రహదారిని దిగ్బంధం చేస్తే షాపులు తిరిగి మూసివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈడిగపాలెంలో కరోనా పాజిటివ్ ఉంటే నిత్యం వాహనాలు తిరిగే ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ప్రధాన రహదారిని కాకుండా ఈడిగపాలెం ప్రాంతాన్ని దిగ్బంధం చేయడంతో వ్యాపారస్థులు శాంతించారు.