టోక్యో సన్నాహకాలకు ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2020-03-07T10:30:55+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో.. భారత్‌లో జరగాల్సిన వరల్డ్‌ కప్‌ షూటింగ్‌ వాయిదా పడింది. ‘కోవిడ్‌-19’తో దేశంలో వాయిదాపడ్డ తొలి పెద్ద టోర్నమెంట్‌ కూడా అదే

టోక్యో సన్నాహకాలకు ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌తో.. భారత్‌లో జరగాల్సిన వరల్డ్‌ కప్‌ షూటింగ్‌ వాయిదా పడింది. ‘కోవిడ్‌-19’తో దేశంలో వాయిదాపడ్డ తొలి పెద్ద టోర్నమెంట్‌ కూడా అదే కావడం గమనార్హం.. దాంతో దేశంలోని మేటి అథ్లెట్ల ఒలింపిక్స్‌ సన్నాహకాలపై ‘కరోనా’ ప్రభావం చూపింది. షూటింగ్‌ వరల్డ్‌ కప్‌ ఈనెల 15 నుంచి 25 వరకు ఇక్కడ నిర్వహించాల్సి ఉండగా..ఏప్రిల్‌ 16నుంచి టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌ రద్దయింది.. ఇకపోతే.. వాయిదాపడిన షూటింగ్‌ వరల్డ్‌ కప్‌ ఒలింపిక్స్‌కు ముందు రెండు దశల్లో జరగనుంది. ‘రైఫిల్‌, పిస్టల్‌ పోటీలు మే 5 నుంచి 12 వరకు, షాట్‌గన్‌ ఈవెంట్‌ జూన్‌ 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు’ అని అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎ్‌సఎ్‌సఎఫ్‌) శుక్రవారం తెలిపింది. ఢిల్లీ షూటింగ్‌ ప్రపంచ కప్‌నుంచి మొత్తం 22 దేశాలు వైదొలగినట్టు జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) అధికారి వెల్లడించారు. మరోవైపు ‘కోవిడ్‌-19’ నివారణ చర్యల్లో భాగంగా..దేశంలోని తన అన్ని కేంద్రాలలో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) సస్పెండ్‌ చేసింది. 


ప్రభావం తీవ్రమే: సింధు, బజ్‌రంగ్‌

ఒలింపిక్స్‌ సన్నాహకాలపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండనుందని షట్లర్‌ పీవీ సింధు, రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా అంగీకరించారు. ‘దేశంలో ఈ వైరస్‌ ఇప్పుడే బయటపడినా దాని ప్రభావం బాగా ఉంది. ఒలింపిక్‌ ఏడాదిలో ఇలా జరగడం ఎంతో చేటు చేస్తుంది. కొన్ని టోర్నీలు వాయిదాపడిన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది వేచి చూడాలి’ అని సింధు పేర్కొంది. ‘పర్యటనలపై నిషేధం విధించడంతో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లలేకపోతున్నాం. దాంతో మా ఒలింపిక్‌ సన్నద్ధతకు విఘాతం కలుగుతోంది’ అని బజ్‌రంగ్‌ వాపోయాడు.

Updated Date - 2020-03-07T10:30:55+05:30 IST