ఆటలన్నీ ఆగినట్టే!
ABN , First Publish Date - 2020-03-06T10:07:29+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ముఖ్యంగా ఒలింపిక్స్ జరిగే ఏడాది కావడంతో క్రీడాకారులు ఆందోళన ...
కరోనా ఎఫెక్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ముఖ్యంగా ఒలింపిక్స్ జరిగే ఏడాది కావడంతో క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. టోక్యోకు అర్హత సాధించాలనే ఆశావహులపై కరోనా పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్వాలిఫయింగ్ టోర్నీలు వైరస్ కారణంగా రద్దవడం, లేదా వాయిదా పడుతుండడంతో అథ్లెట్లు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ఇటీవలి కాలంలో కరోనా వైరస్కు గురైన టోర్నీలు..
అథ్లెటిక్స్
ఈ నెల 13 నుంచి 15 వరకు నాన్జింగ్లో జరగాల్సిన వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్షి్ప్సను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
ఉభయ కొరియాల్లో జరగాల్సిన ప్యాంగ్యాంగ్, సియోల్ మారథాన్లను రద్దు చేశారు. అలాగే పారిస్ హాఫ్ మారథాన్ను రద్దు చేశారు.
చైనాలోని చెంగ్డూలో మేలో నిర్వహించాల్సిన మిక్స్డ్ రిలే ఒలింపిక్ ట్రయాథ్లాన్ ఈవెంట్ను స్పెయిన్కు మార్చా రు. అయితే, అక్కడ జరిగేదీ డౌటే.
బ్యాడ్మింటన్
ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్లు జర్మన్ ఓపెన్ (మార్చి 3-8), వియత్నాం ఓపెన్ (మార్చి 24- 29), పోలిష్ ఓపెన్ (మార్చి 26-29)లు రద్దయ్యాయి.
బాక్సింగ్
వుహాన్లో జరగాల్సిన ఒలింపిక్ బాక్సింగ్ అర్హత పోటీలను జోర్డాన్కు తరలించారు. ఈనెలలో నిర్వహించాల్సిన అన్ని రకాల బాక్సింగ్ టోర్నీలను జపనీస్ బాక్సింగ్ సంఘం రద్దు చేసింది.
ఫుట్బాల్
చైనాలో నిర్వహించాల్సిన అన్ని ఫుట్బాల్ ఈవెంట్లనూ ఆ దేశ సంఘం రద్దు చేసింది. వైరస్ భయం రోజురోజుకూ పెరుగుతుండడంతో యూరో-2020లో కొన్ని మ్యాచ్లను రద్దు చేసే అవకాశం ఉంది.
ఫార్ములా వన్
వచ్చే నెల 19న నిర్వహించాల్సిన చైనీస్ గ్రాండ్ ప్రీని వాయిదావేశారు. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ, వియత్నాం గ్రాండ్ ప్రీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించే అవకాశాలున్నాయి.
టెన్నిస్
ఈ నెల 6 నుంచి రొమేనియాతో డేవిస్ కప్ మ్యాచ్ను చైనా వదిలేసుకొంది. పురుషుల టీమ్ రొమేనియా వెళ్లే పరిస్థితులు లేకపోవడమే ఇందుకు కారణం. చైనాలో వచ్చే నెలలో షెడ్యూల్ చేసిన జియాన్ ఓపెన్నూ రద్దు చేశారు. జపాన్-ఈక్వెడార్తో డేవిస్ కప్ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించనున్నారు.
ఆర్చరీ
బ్యాంకాక్లో జరగనున్న ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ నుంచి భారత్ తప్పుకొంది. థాయ్లాండ్లో ఈ నెల 8 నుంచి 15 వరకు టోర్నీని షెడ్యూల్ చేశారు.
ఐపీఎల్లో ఆడే తమ ఆటగాళ్లపై న్యూజిలాండ్ క్రికెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫ్యాన్స్కు దూరంగా ఉండాలని ఈపాటికే సూచించింది. కాగా, శ్రీలంక పర్యటనలో కరచాలనం చేయబోమని ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ప్రకటించాడు.
‘ఆల్ ఇంగ్లండ్’ నుంచి ప్రణయ్ అవుట్
కరోనా వైరస్ కారణంగా ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షి్పనుంచి భారత సింగిల్స్ షట్లర్ హెచ్ఎ్ప ప్రణయ్, పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి వైదొలిగారు. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ టోర్నీ కూడా అయిన ఆల్ ఇంగ్లండ్ ఈనెల 11న బర్మింగ్హామ్లో మొదలవనుంది. అయితే పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మాత్రం ఆ టోర్నీలో ఆడుతున్నారు.