కరోనా బాధితులపట్ల నిర్లక్ష్యం తగదు
ABN , First Publish Date - 2020-07-08T11:08:33+05:30 IST
కరోనా వైరస్ సోకిన, అనుమానితులపట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు..
ప్రొద్దుటూరు టౌన్, జూలై 7: కరోనా వైరస్ సోకిన, అనుమానితులపట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు పేర్కొ న్నారు. అధికారుల వైఖరికి నిరసనగా మంగళవారం తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్-19 సెంటర్, గోపవరం పంచాయతీలోని పశువైద్యకళాశాలలో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో కరోనా బాధితులకు నాణ్యమైన భోజనం అందించడంలేదని, మంచినీటి వసతి లేదని, బాత్రూముల్లో నీరు రావడంలేదని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదన్నారు.
వెలువలికి చెందిన అనుమానితులను మూడు రోజులుగా క్వారంటైన్ సెంటర్లో ఉంచి రోజు టెస్టుల పేరుతో జిల్లా ఆస్పత్రికి తిప్పుతున్నారేకానీ ఎటువంటి టెస్టులు చేయడంలేదని దీంతో ఇంటి వద్ద పశువులు, పెంపుడు జంతువులకు తిండిపెట్టేవారు లేక ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, మానవ హక్కు ల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, విరసం సభ్యురాలు వరలక్ష్మి పాల్గొన్నారు.