చుట్టుబందలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-06-05T09:40:43+05:30 IST
క్వారంటైన్లో ఉన్నప్పుడు అధికారులు అవసరమైన పరీక్షలు నిర్వహించలేదని గ్రామస్థులకు చెప్పడంతో వారు అతడిని వైద్యపరీక్షలకు ..
మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీ
క్వారంటైన్లో 14 రోజులు ఉన్న
పరీక్షలు నిర్వహించలేదని ఆరోపణ
గ్రామస్థులకు చెప్పడంతో
నర్సీపట్నం ఆస్పత్రిలో పరీక్షలు
కరోనా నెగిటివ్గా రావడంతో
ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు
కొయ్యూరు: క్వారంటైన్లో ఉన్నప్పుడు అధికారులు అవసరమైన పరీక్షలు నిర్వహించలేదని గ్రామస్థులకు చెప్పడంతో వారు అతడిని వైద్యపరీక్షలకు పంపించిన ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో అతనికి నెగిటివ్ రావడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోని వెళితే.. మండలంలో కినపర్తి పంచాయతీ చుట్టుబంద గ్రామానికి చెందిన యువకుడు జీవనోపాధి నిమిత్తం మహారాష్ట్ర వెళ్లి ఇటీవల తిరిగి వచ్చి రావణాపల్లి క్వారంటైన్లో 14 రోజులు గడిపాడు. క్వారంటైన్లో ఉన్నపుడు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉండడం, కొంచెం దగ్గు ఉందని పరీక్షలు చేయాలని కోరినా అప్పట్లో అతడిని ఎవ్వరూ పట్టించుకోలేదు.
మంగళవారం అతడిని ఇంటికి పంపించడంతో కుటుంబీకులకు రెండు రోజులు దూరంగా ఉన్నాడు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ కావడంతో గురువారం గ్రామస్థులకు తెలిపాడు. దీంతో వారు స్థానిక టీడీపీ నేత దుచ్చరి చిట్టిబాబు, గ్రామ యువకుడు పద్మశ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వారు కృష్ణాదేవీపేట పీహెచ్సీకి సమాచారమందించారు. దీంతో వెంటనే పీహెచ్సీ సిబ్బంది అంబులెన్సులో బాధితుడిని కోవిడ్-19 పరీక్షలకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడి రక్త నమూనాలు తీసుకున్న ఆస్పత్రి వైద్యులు తిరిగి అతడిని రావణాపల్లి క్వారంటైన్కు పంపారు. అయితే అతడికి కరోనా నెగిటివ్ వచ్చినట్టు వైద్య సిబ్బంది తెలిపారు.