కరోనా తగ్గుముఖం
ABN , First Publish Date - 2020-10-16T06:32:27+05:30 IST
గత వారం రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
ఉమ్మడి జిల్లాలో 270 కేసులు నమోదు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : గత వారం రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో వారం రోజులుగా 300 లోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గురువారం రంగారెడ్డి జిల్లాలో కేవలం 75 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం. మేడ్చల్ జిల్లాలో 180, వికారాబాద్ జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాలో గురువారం 270 కేసులు నమోదయ్యాయి. కరోనా పరీక్షలు తగ్గడంతో కేసుల సంఖ్య తగ్గుతోన్నట్లు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం డివిజన్లో..
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్లో గురువారం 11 కేంద్రాల్లో 223 మందికి కరోనా యాంటీజెన్ టెస్టులు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ వచ్చింది. సీహెచ్సీ ఇబ్రహీంపట్నంలో ఒకరికి, యాచారంలో ఒకరికి, మంచాలలో ఐదుగురికి, ఆరుట్లలో ఒకరికి, మాడ్గులలో ఒకరికి, అబ్దుల్లాపూర్మెట్లో ఒకరికి, తట్ట్టిఅన్నారంలో ఐదుగురికి, రాగన్నగూడలో ఐదుగురికి పాజిటివ్గా తేలింది.
శంషాబాద్లో మూడు కేసులు
శంషాబాద్ : శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 33 మందికి పరీక్షలు చేసినట్లు డాక్టర్ నజ్మాభాను తెలిపారు.
షాద్నగర్ డివిజన్లో 14 మందికి పాజిటివ్
షాద్నగర్: షాద్నగర్ డివిజన్లో గురువారం 183 మందికి కరోనా యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 14 మందిలో షాద్నగర్ పట్టణానికి చెందిన ఇద్దరు, కొత్తూర్ మండలానికి చెందిన 8 మంది, కొందుర్గు మండలానికి చెందిన నలుగురు ఉన్నట్లు వారు వివరించారు.