జీహెచ్ఎంసీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2021-03-31T22:19:19+05:30 IST
జీహెచ్ఎంసీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జీహెచ్ఎంసీలో రోజుకు 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జీహెచ్ఎంసీలో రోజుకు 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వారం రోజులుగా కూకట్పల్లిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లతో ఐసీయూ వార్డులు నిండుతున్నాయి. రోగుల తాకిడి పెరగడంతో కరోనా బాధితులను వారంలోనే ఆస్పత్రులు డిశ్చార్జి చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో 200 పడకలతో కరోనా వార్డును సిద్ధం చేశారు. కింగ్కోఠి ఆస్పత్రిలో 300 బెడ్లు కేటాయించారు.
చూస్తుండగానే నగరం నలుమూలలా కరోనా వ్యాపిస్తోంది. భయపడేవాళ్లు భయపడుతూనే ఉన్నారు. డోన్ట్కేర్ అనేవాళ్లు అలాగే వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత కరోనా మళ్లీ ఇలా విజృంభించడానికి శాస్త్రపరమైన కారణాలు ఎలా ఉన్నా, జనంలో నిర్లక్ష్యమే ప్రధాన హేతువుగా కనిపిస్తోంది. కరోనా గురించి మాట్లాడడం, ఎక్కువ జాగ్రత్తలు పాటించడం తక్కువగా ఉంటోంది. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు మళ్లీ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది అనుభవాల నుంచి నేర్చుకున్న అంశాలతో ఈసారి ప్రణాళికను రూపొందించాలని చెబుతున్నారు.