వలస పక్షులపై కరోనా పంజా

ABN , First Publish Date - 2020-05-27T10:32:13+05:30 IST

జిల్లాలో కరోనా తగ్గినట్టే తగ్గి విజృంభిస్తోంది. సోమవారం ఒక్క కేసు కూడా నమోదకాలేదు.

వలస పక్షులపై కరోనా పంజా

మర్రిపాడులో ముగ్గురికి వైరస్‌

సూళ్లూరుపేటలో మరో ముగ్గురికి..

 ఒక్క రోజులో పది కేసుల నమోదు 


నెల్లూరు(వైద్యం) మే 26 : జిల్లాలో కరోనా తగ్గినట్టే తగ్గి విజృంభిస్తోంది. సోమవారం ఒక్క కేసు కూడా నమోదకాలేదు. అయితే, మంగళవారం 10 పాజిటివ్‌ కేసులు రికార్డుకెక్కాయి. రాష్ట్రంలోనే బయటి ప్రాంతాల్లో పని చేస్తున్న మర్రిపాడు మండలం కేతుగుంట గ్రామానికి చెందిన ముగ్గురు  కూలీలు కరోనా పాజిటివ్‌కు గురయ్యారు. దీంతో జిల్లాలో తొలిసారిగా వలస కూలీలకు కరోనా సోకడం జరిగింది. ఇక సూళ్లూరుపేటలో కోయంబేడు ప్రభావం కొనసాగుతోంది. మరో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


మహదేవయ్యనగర్‌, వట్రపాళెం, వనంతోపులలో ఈ కేసులు నమోదయ్యాయి. కలువాయి మండలం పర్లకొండ, ఆత్మకూరు వెన్నువాడ, దొరవారి సత్రం మండలం కల్లూరు, నెల్లూరు నగరం కోటమిట్ట ప్రాంతాలలో ఒక్కో కేసు చొప్పన నమోదైంది. దీంతో జిల్లావ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 233కు చేరుకుంది. కాగా, నెల్లూరులోని రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ సుబ్బారావు, సిబ్బందికి మంగళవారం కరోనీ పరీక్షలు నిర్వహించారు.


దొరవారిసత్రంలో తొలికేసు..

దొరవారిసత్రం : కోయంబేడు ఎఫెక్ట్‌తో దొరవారిసత్రంలో తొలి కరోనా కేసు నమోదైంది.  కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చిన యువకుడు కొద్ది రోజులుగా నెల్లూరు క్వారంటైన్‌లో ఉన్నాడు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో  ఆ యువకుడికి పాజిటీవ్‌గా నమోదైంది. యువకుడి కుటుంబంతో సంబంధాలు కలిగిన 18 మందిని కూడా క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. తహసీల్దారు పద్మావతి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డిలు స్థానిక వైద్య సిబ్బందితో కలిసి పారిశుధ్య పనులు చేపడుతున్నారు. 

Updated Date - 2020-05-27T10:32:13+05:30 IST