కరోనాపై సీసీఎంబీ సమరం
ABN , First Publish Date - 2020-03-31T08:43:43+05:30 IST
కరోనాపై భారత్ జరుపుతున్న పోరులో హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) నేను సైతం అంటూ పాల్గొంటోంది. ఆ సంస్థలో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు సోమవారం (మార్చి 30) నుంచి ప్రారంభమయ్యాయి. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా వైరస్
- వారంలోగా ఆర్ఎన్ఏ విశ్లేషణ
- కొవిడ్ -19 పరీక్షలు ప్రారంభం
- రోజుకు 750 టెస్టుల సామర్థ్యం
- ఎండతో వైరస్ వ్యాప్తి తగ్గదు
- ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో
- సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా
కరోనాపై భారత్ జరుపుతున్న పోరులో హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) నేను సైతం అంటూ పాల్గొంటోంది. ఆ సంస్థలో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు సోమవారం (మార్చి 30) నుంచి ప్రారంభమయ్యాయి. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా వైరస్ జన్యుక్రమాన్ని కనుగొనడంపై ఇక్కడి శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. దీంతోపాటు కరోనా పీచమణిచే కొత్త మందులను కనుగొనడానికి దోహదపడే పరిశోధనలూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కరోనాపై పోరులో సీసీఎంబీ పాత్ర ఏమిటి?
కరోనా నిర్ధారణ పరీక్షలను సీసీఎంబీ ఇప్పటికే ప్రారంభించింది. దీంతోపాటు ఆ వైరస్ జన్యుక్రమాన్ని కనుగొని, దానిలో వస్తున్న మార్పులను గుర్తించడానికి పరిశోధనలు చేస్తున్నాం. దీన్ని కనుగొనగానే దాని ఆ ధారంగా.. వైర్సపై ఏయే మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయో ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటాం.
రోజుకు ఎన్ని నిర్ధారణ పరీక్షలు చేయగలరు?
ప్రస్తుతానికి రోజుకు 750దాకా పరీక్షలు చేయగలం. హైదరాబాద్లోనే ఉన్న సీడీఎ్ఫడీ లాంటి పరిశోధనా సంస్థల సహకారం లభిస్తే వెయ్యి దాకా ఈ పరీక్షలు చేయొచ్చు. దీంతోపాటు అతిచౌక కరోనా పరీక్షల కిట్ల అభివృద్ధికి మేం ప్రయత్నాలు మొదలుపెట్టాం. ప్రస్తు తం అందుబాటులో ఉన్న కిట్ల కంటే మేం తయారుచేయనున్న కిట్ల రేటు చాలా తక్కువ.
జన్యుక్రమంపై సాగుతున్న పరిశోధనలేంటి?
హైదరాబాద్లో చికిత్స పొందిన కరోనా పాజిటివ్ కేసుల నుంచి వైరస్ నమూనాలను సేకరించి, వాటిపై పరిశోధనలు ప్రారంభించాం. వారం రోజుల్లోగా ఈ వైర్స ఆర్ఎన్ఏ విశ్లేషణ చేయగలుగుతాం. ఆ ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వైర్సను ఎలా ఎదుర్కోవచ్చనే విషయంపై స్పష్టత వస్తుంది.
మందు తయారీకి సాగుతున్న పరిశోధనలు...
మాకు మందులు తయారుచేసే సామర్థ్యం లేదు. కానీ మానవుల నుంచి సేకరించిన కణాలపై ప్రయోగశాలలో కరోనా వైర్సను ప్రయోగించి, వాటికి అందుబాటులో ఉన్న మందులను ఇస్తాం. దీనికి శరీర కణాలు ఎలా స్పందిస్తున్నాయో కనుగొంటాం.
కొవిడ్-19లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు జరిగి ఉండొచ్చు ? అది బలహీనపడుతోందా?
వైరస్ జన్యువుల్లో మార్పులు జరగడమనేది ఒక నిరంతర ప్రక్రియ. అలాగే కొవిడ్-19 వైర్సలోనూ కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి కూడా. వైర్సలో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయం ఆర్ఎన్ఏ విశ్లేషణ తర్వాతే తెలుస్తుంది. అయితే ఏ వైరస్ అయినా కాలంతోపాటు బలపడుతుంది తప్ప బలహీనపడదు.
ఎండలు పెరిగితే కరోనా వ్యాప్తి తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి కదా.. మీ అభిప్రాయమేమిటి?
ఔను.. నేను కూడా చూశా. అయితే ఇవన్నీ పరిశోధనా శాలల్లో కట్టుదిట్టమైన పరిస్థితుల్లో చేసిన పరిశోధనలు. చాలా ప్రాథమికమైన పరిశోధనలు. మరిన్ని అధ్యయనాలు జరిగితే తప్ప ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం.
కరోనాపై పోరాడే శక్తి భారతీయులకు జన్యుపరంగా ఉందని ఓ పరిశోధనాపత్రంలో ప్రస్తావించారు. ఇది ఎంత వరకు నిజం?
ఈ పరిశోధనాపత్రాన్ని నేను కూడా చూశా. ఆ పరిశోధకులు రెండు ఆర్ఎన్ఏ నమూనాల ఆధారంగా ఈ ప్రతిపాదన చేశారు. కొన్ని సమూహాల ప్రజలకు ఈ వైర్సను తట్టుకొనే సామర్థ్యం ఉండొచ్చు. కానీ ఇది ప్రాథమిక పత్రం మాత్రమే. దీనిపై ఇంకా సమీక్ష (పీర్ రివ్యూ) జరగాల్సి ఉంది. సాధారణంగా చాలా ఎక్కువ నమూనాలను తీసుకొని తులనాత్మకంగా విశ్లేషించిన తర్వాతే ఈ విధమైన నిర్ణయాలకు రావాలి. లేకపోతే అవి తప్పు అయ్యే ప్రమాదం ఉంటుంది.
కరోనా వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణమేమిటి?
ప్రతి వైర్సకు ఒక రిసిప్టర్ ఉంటుంది. దీని ద్వారానే వైరస్ శరీర కణాల్లోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా మన శరీర కణాలు ఈ రిసిప్టర్లను పసిగట్టి, అవి లోపలికి ప్రవేశించకుండా పెద్ద యుద్ధమే చేస్తాయి. కరోనా వైరస్ రిసిప్టర్ మిగిలిన వాటి కంటే చాలా భిన్నంగా ఉండటంతో దీన్ని మన శరీర కణాల్లో ఉండే రిసిప్టర్లు అడ్డుకోవు. అందువల్లే ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.
కరోనా కట్టడిపై తెలంగాణ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీలో మీరు కూడా ఉన్నారు కదా.. కమిటీ తరఫున ఎలాంటి సలహాలిచ్చారు ?
రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు చేశాం. వీటిలో మొదటిది హెల్త్ వర్కర్స్కు అవసరమైన సామగ్రిని సమకూర్చడం. వారికి అవసరమైన మాస్క్లు, బాడీ సూట్లు, శానిటైజర్లు ఇతర సామగ్రిని అందించమని ప్రభుత్వాన్ని కోరాం. కరోనాపై అవగాహన కల్పించే సందేశాలను వీలైనంత ఎక్కువగా ప్రజలకు పంపమని కోరాం. అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ మహమ్మారిని ఎదుర్కోవడం సులభమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయం..
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణా ప్రభుత్వం ముందు ఉంది. ప్రభుత్వం చాలా మంచి చర్యలు తీసుకుంటోంది. నా ఉద్దేశంలో లాక్డౌన్ చాలా మంచి చర్య. దీని వల్ల ఈ వ్యాధి ఒకేసారి వేల మందికి రాకుండా ఉంటుంది. అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే. ఈ వైర్సకు వ్యాక్సిన్ లేదు. మందు లేదు. అందువల్ల భౌతిక దూరం ఒకటే మనకున్న మార్గం. దీనిని అందరూ పాటిస్తేనే మంచిది.
- స్పెషల్ డెస్క్