పల్లెలను జల్లెడ పట్టాలి
ABN , First Publish Date - 2021-05-09T04:46:11+05:30 IST
పల్లెల్లో కరోనా కేసుల గుర్తింపునకు జల్లెడ పట్టాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. శనివారం మండల స్థాయి అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కట్టుదిట్టమైన చర్యలతో పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల కొంతమేర తగ్గిందన్నారు. ఇప్పుడు గ్రామాల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కనుక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి దాన్ని అడ్డుకోవాలని సూచించారు.
కరోనా కేసులను గుర్తించాలి
కలెక్టర్ నివాస్
కలెక్టరేట్, మే 8: పల్లెల్లో కరోనా కేసుల గుర్తింపునకు జల్లెడ పట్టాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. శనివారం మండల స్థాయి అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కట్టుదిట్టమైన చర్యలతో పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల కొంతమేర తగ్గిందన్నారు. ఇప్పుడు గ్రామాల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కనుక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి దాన్ని అడ్డుకోవాలని సూచించారు. కర్ఫ్యూ సమయంలో ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయాలని, ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు నిబంధనలు పక్కగా పాటించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సీహెచ్.శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, ఆర్డీవోలు, ప్రత్యేకాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మరో ముగ్గురి మృతి
- 1,398 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 8 : జిల్లాలో కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. పాజిటివ్ బాధితులతో పాటు కొవిడ్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం కరోనా బారిన పడి మరో ముగ్గురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో కొవిడ్ మృతుల సంఖ్య 427కు చేరింది. ఇదిలా ఉండగా, శనివారం 1,398 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లాలో ఇప్పటివరకు 11,17,573 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 84,219కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. శనివారం 1,255 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 19,612 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్లో 16,705 మంది, కొవిడ్ కేర్ సెంటర్లలో 987 మంది, కొవిడ్ ఆస్పత్రుల్లో 1,920 మంది చికిత్స పొందుతున్నారు.