రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల
ABN , First Publish Date - 2020-08-09T06:52:45+05:30 IST
కరోనా కోరలుచాచి విజృంభిస్తోంది. పట్టణాలకేగాక పచ్చని పల్లెలకూ విస్తరించింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ ..
- వణుకుతున్న జనం
కరోనా కోరలుచాచి విజృంభిస్తోంది. పట్టణాలకేగాక పచ్చని పల్లెలకూ విస్తరించింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ఇప్పటి వరకు మనకేం కాదులే అనుకున్న పల్లెజనం, కరోనా దాడితో వణికిపోతున్నారు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. లాక్డౌన్ సడలింపుతో జనం ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తుండటం, జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి అధికమైంది. దీంతో వ్యాపారులు ఎక్కడికక్కడ స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
- ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్
ఉమ్మడి జిల్లాలో శనివారం ఒక్క రోజే 110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం జూన్ 30వ తేదీ నుంచి శనివారం వరకు అంటే 40 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 2,354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 21 మంది మృతిచెందారు. పాజిటివ్తో చికిత్స పొంది 203 మంది కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2130 పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
పాజిటివ్లు ఇలా...
- ఉమ్మడి జిల్లాలో శనివారం 110 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. నల్లగొండ జిల్లాలో 61, సూర్యాపేటలో 25, యాదాద్రిలో 24 కేసులు నిర్ధారణ అయ్యాయి.
- దేవరకొండలో 12, పీఏపల్లిలో రెండు, తిరుమలగిరిలో రెండు, భూదాన్పోచంపల్లిలో ఒకటి, చండూరులో ఐదు, మోత్కూరులో ఒకటి, మునగాలలో ఒకటి, ఆలేరులో మూడు, వలిగొండలో రెండు, చౌటుప్పల్లో ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. చింతపల్లిలో ఒకటి, డిండిలో రెండు, రామన్నపేటలో ఒకటి, శాలిగౌరారంలో ఒకటి, సంస్థాన్ నారాయణపురంలో ఒకటి, యాదగిరి గుట్టలో
- నాలుగు పాజిటివ్ కేసులు వచ్చాయి.
- భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామానికి చెందిన పాజిటివ్ వచ్చిన ఓ యువకుడు కరోనా భయంతో చౌటుప్పల్ మల్కాపురం శివారులోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
- మోత్కూరు మోత్కూరు మునిసిపాలిటీ, బుజిలాపురం గ్రామానికి చెందిన యూటీఎఫ్ సీనియర్ నేత ఒకరు కరోనాతో మృతిచెందారు.
- గుండాల మండలంలోని నూనెగూడం గ్రామానికి చెందిన మహిళ కరోనాతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతిచెందింది.
- వేములపల్లి మండలంలోని మంగాపురం గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందాడు.
- దేవరకొండలో ఈనెల 10 నుంచి 20వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించేలా వ్యాపారులు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, పాల దుకాణాలు ఉదయం 10.30వరకే తెరిచి ఉంటాయి.
- నల్లగొండ పట్టణ పరిధిలోని అన్నెపర్తిలో 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఇద్దరు ప్లాస్మా దానం చేశారు.