సాయం పేరుతో జాతర

ABN , First Publish Date - 2020-04-07T10:57:43+05:30 IST

విశాఖపట్నంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

సాయం పేరుతో జాతర

లాక్‌డౌన్‌ రూల్స్‌ పాతర. భౌతిక దూరానికి వైసీపీ రాంరాం!


విశాఖపట్నం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు.. ‘కరోనా కాలంలో ఆర్థిక సాయం’ పేరుతో ప్రజలందరినీ ఒకచోట చేర్చి నిబంధనలను కాలరాస్తున్నారు. ప్రస్తుతం నలుగురు కంటే ఎక్కువ మంది ఒక దగ్గర వుండకూడదంటూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఈ సమయంలో సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకూడదు. కానీ విశాఖపట్నంలో అనుమతులు ఇవ్వడమే కాకుండా స్వయంగా వారే ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.


వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నం ప్రజలకుసేవ చేసేందుకు కొన్నాళ్ల క్రితం ప్రగతి భారతి ఫౌండేషన్‌ చారిటుబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు పేరుతో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని హనుమంతవాకలోని సీఎంఆర్‌ ఫంక్షన్‌ హాలులో సోమవారం నిర్వహించారు. దీనికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, ఐపీఎస్‌ అధికారి విశాఖ డీసీపీ-1 రంగారెడ్డితోపాటు నగర వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేదికపై తొలుత భౌతికదూరం పాటించిన పెద్దలు ఆ తరువాత ఆ విషయం మరిచిపోయి ‘సెల్ఫీ’లు దిగారు. ఇక విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి సాగనంపే సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులంతా గుమిగూడారు. భౌతిక దూరం విషయమే మరిచిపోయారు. రోడ్లపైన, రైతు బజార్ల దగ్గర నలుగురి కంటే ఎక్కువ మంది కనిపిస్తే లాఠీ ఝళిపించే పోలీసు అధికారులు అక్కడ అంత తంతు జరుగుతున్నా... కళ్లు అప్పగించి చూస్తుండిపోయారు. 

Updated Date - 2020-04-07T10:57:43+05:30 IST