గుంటూరులో.. తగ్గని కరోనా ఉధృతి
ABN , First Publish Date - 2020-08-02T12:35:01+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు..
మరో వెయ్యి!
గుంటూరులో అత్యధికంగా 333
పిడుగురాళ్లలో 94 కేసులు
కొవిడ్ వారియర్గా కలెక్టర్
గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా నమోదు అవుతున్నట్లుగానే శనివారం ఒక్క రోజే పాజిటివ్ కేసుల సంఖ్య 1,001గా నమోదైంది. గుంటూరు నగరంలో అత్యధికంగా 333 మంది కొవిడ్ బారిన పడ్డారు. అనూహ్యంగా పిడుగురాళ్లలో ఒక్క రోజులోనే 94 మందికి వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తెనాలి పట్టణంలో శనివారం 13, రూరల్ మండలంలోని సోమసుందరపాలెం, సంగం జాగర్లమూడి, అగ్రహారంలలో ఒక్కొ కేసు నమోదయ్యాయి. కాగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ లేకపోవడంతో కొవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మహిళా వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా కొన్ని గంటలు అక్కడే ఉంచడంతో వార్డులో మిగిలిన బాధితులంతా తీవ్ర ఆందోళన చెందారు.
రాజుపాలెం మండలంలో 25 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిణి భువనేశ్వరి తెలిపారు. పొన్నూరు 149 మందికి పరీక్షలు చేయగా, వారిలో 35 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని మెడికల్ ఆఫీసరు డాక్టర్ పి.రత్నబాబు తెలిపారు. నరసరావుపేట పట్టణంలో 49 మందికి కరోనా పాజిటివ్ శనివారం నిర్ధారించారు. మండలంలోని గ్రామాలలో 14 కేసులు నమోదయ్యాయి. మంగళగిరి పట్టణంలో 17 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.