తూ.గో.లో కలకలం.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే..
ABN , First Publish Date - 2020-09-25T17:20:00+05:30 IST
జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య గమనిస్తుంటే ఆందోళన రేకెత్తిస్తోంది..
కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య గమనిస్తుంటే ఆందోళన రేకెత్తిస్తోంది. ఏదైతే ఇంతకాలం జరగకూడదని జిల్లా యంత్రాంగం, ప్రజానీకం భావిస్తుందో దీనికి భిన్నంగా కరోనా కేసుల బాధితుల సంఖ్య నమోదవుతున్నాయి. కాలం గడిచే కొద్దీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోగా మరింత పెరుగుతూ వస్తున్నాయి. మరో 8,858 మంది కొవిడ్ బారిన పడితే జిల్లాలో కరోనా కేసులు లక్షకు చేరుకుంటాయి.
మరో వారం రోజుల్లో లక్షకు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,095 కేసులు నమోదవ్వడంతో మొత్తం పాజిటివ్ల సంఖ్య 91,142కు చేరింది. ఇందులో ట్రూ నాట్ ద్వారా చేసిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాల్లో 443, రాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 652 మందికి వైరస్ సోకిందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. అయితే ప్రస్తుతం 11,395 మంది యాక్టివ్ దశలో ఉన్నారు. నలుగురు తాజాగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 501 చేరింది. ఇదే క్రమంలో వ్యాధి బారిన పడిన వృద్ధులు సైతం కోలుకుంటున్నారని, ఇందులో జిల్లాలో శతాధిక వృద్ధురాలు కోలుకుందని తాజాగా కోలుకుందని వైద్యులు తెలిపారు.