మొన్న తండ్రికి.. నేడు కూతురికి కరోనా.. ఓ గ్రామంలో కలకలం..

ABN , First Publish Date - 2020-05-26T20:22:10+05:30 IST

జనగామ జిల్లాకు వలసల గండం పట్టుకుంది. ఈ నెల మొదటి వారం వరకు ప్రశాంతంగా ఉన్న పాలకుర్తి మండలం శ్రామిక్‌ రైళ్ల రాకతో వలస కూలీలు ఇతర రాష్ర్టాల నుంచి స్వస్థలాలకు చేరుతుండడంతో ఆందోళన నెలకొంది.

మొన్న తండ్రికి.. నేడు కూతురికి కరోనా.. ఓ గ్రామంలో కలకలం..

విస్నూరులో మరో కరోనా కేసు

భయం గుప్పిట్లో పాలకుర్తి వాసులు


పాలకుర్తి(ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాకు వలసల గండం పట్టుకుంది. ఈ నెల మొదటి వారం వరకు ప్రశాంతంగా ఉన్న పాలకుర్తి మండలం శ్రామిక్‌ రైళ్ల రాకతో వలస కూలీలు ఇతర రాష్ర్టాల నుంచి స్వస్థలాలకు చేరుతుండడంతో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే... ఈ నెల 14న మహారాష్ట్ర ముంబయి నుంచి తండ్రి, కూతురు శ్రామిక్‌ రైలులో మండలంలోని విస్నూరు గ్రామానికి రాగా అదే రోజు నుంచి అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. 17న ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితుడిని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షలు చేసి శాంపిల్‌ను హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రికి పంపించారు. 19న కరోనా పాజిటివ్‌ రిపోర్టు రావడంతో అదే రోజు జనగామ నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. 


అదే విధంగా కూతురు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, అధికారులు ఈ నెల 22న జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి శాంపిల్‌ను 23న హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రికి పంపించారు. ఆదివారం రాత్రి ఆమెకు కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో అశోక్‌కుమార్‌ తెలిపారు. విస్నూరులో ఒకే ఇంట్లో తండ్రి, కూతురు కరోనా బారిన పడగా కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని పలువురు కోరారు. దీంతో పాలకుర్తి మండల వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు. కాగా, ఈ పాజిటివ్‌ కేసులను అధికారులు జిల్లాకు సంబంధించినవిగా కాకుండా ప్రత్యేకంగా వలస కూలీల లెక్కల్లో చేరుస్తున్నారు.

Updated Date - 2020-05-26T20:22:10+05:30 IST