అరకు ఎంపీ స్వగ్రామంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-08-12T13:10:30+05:30 IST
అరకు ఎంపీ మాధవి స్వగ్రామమైన శరభన్నపాలెంలో కరోనా కలకలం..
మరో నలుగురి నిర్ధారణ
గ్రామంలో తొమ్మిదికి చేరిన పాజిటివ్లు
కొయ్యూరు(విశాఖపట్నం): అరకు ఎంపీ మాధవి స్వగ్రామమైన శరభన్నపాలెంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఒకేరోజు ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం.. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో మరో నాలుగు కేసులు వెలుగు చూడడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో జూలై 28న ఒక వివాహ వేడుకను నిర్వహించి విందు ఏర్పాటు చేసిన కుటుంబానికి చెందిన నలుగురితోపాటు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా పాజిటివ్ సోమవారం నిర్ధారణ అయ్యింది.
దీంతో ఎంపీ మాధవి స్పందించి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోల మాట్లాడి మంగళవారం గ్రామంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 25 మందికి పరీక్షించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ మాధవి మాట్లాడుతూ.. కరోనా విషయమై ప్రజలు ఆందోళనకు గురికావద్దని, బాధితుల పట్ల వివక్ష చూపవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త శివప్రసాద్, వైద్యాధికారిణి ప్రణతి, ఎల్టీ బాబూరావు, ఏఎన్ఎం చెల్లయ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.